1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 జులై 2021 (14:26 IST)

కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ బుల్లెట్ రైడ్ - ప్రజా సమస్యలపై సూచన

కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌ బుల్లెట్ రైడ్ నిర్వహించారు. మొన్నటివరకు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న ఈయన ఇపుడు కృష్ణా జిల్పా ఎస్పీగా చార్జ్ తీసుకున్నారు. ఇలా బాధ్యతలు తీసుకుని 4 రోజులు గడవక ముందే, ఆయన బుల్లెట్‌పై రైడ్ చేసి ప్రజల సమస్యలు తెలుకున్నారు. 
 
మచిలీపట్నంలో బైక్‌ ర్యాలీ నిర్వహించి, పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యల గురించి తెలుసుకున్నారు. ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 
 
ఆర్‌పేట ఠాణాను తనిఖీ చేసి, సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు సచివాలయ స్థాయిలో మహిళా పోలీసు వద్దే పరిష్కారం అయితే, ప్రభుత లక్ష్యం నెరవేరినట్టేనని కామెంట్ చేశారు. 
 
ఫ్రెండ్లీ పోలీసింగ్‌ వ్యవస్థతో ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిబ్బందిని కోరారు. తమపై జరుగుతున్న దాడుల గురించి మహిళలు నిర్భయంగా ముందుకొచ్చి చెప్పుకునేందుకు వీలుగా.. దిశ, స్పందన పోలీసు విభాగాలు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ వివరించారు.
 
సమస్యల పరిష్కారానికి మహిళల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాల్లో సంప్రదించాలని సూచించారు. పోలీస్‌స్టేషన్లకు వచ్చే వారితో మర్యాదగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదు వచ్చినా చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.