శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (12:31 IST)

దోశలో ఉల్లికి చెల్లు... దిగొచ్చే వరకూ అంతే..

ఉల్లిదోశ అంటే నోరూరని వారుండరు.. ఊతప్పం, సమోసా.. ఇలా తెలుగు వంటల్లో చాలా వాటిలో ఉల్లికి స్థానం ఉంది. కానీ ఉల్లి ధర ఆకాశానికి అంటడంతో దోశలో ఉల్లి.. సమోసాలో ఉల్లి తరుగు, ఊతప్పంలో అవేవి కనిపించకుండానే దోశలు రెడీ చేస్తున్నారు. రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. వివరాలిలా ఉన్నాయి. 
 
తెలుగు రాష్ట్రాలలో ఉల్లి వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉల్లి కొరత ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే హోటళ్ళలో తిరగమాతలలో ఉల్లి బదులు క్యాబేజీ వాడుతున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వారం రోజుల నుంచి ఉల్లి దోసె దొరకడమే కష్టమైపోయింది. ఉల్లి దోసె, సమోసాల విక్రయాలకు పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్ల యజమానులు తాత్కాలిక విరామం పలికారు.  ఉల్లిదోశ, సమోసాలు లేవని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. చపాతీ, బిర్యానీ వంటి వాటిలోకి స్నాక్స్ కింద ఉల్లిని ఇవ్వడం లేదు.
 
భోజనానికి ముందు ఇచ్చే సలాడ్‌లో కూడా ఉల్లి లేకుండానే కీర, కూరగాయల సలాడ్ ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో పెద్ద ఉల్లిపాయల ధర కిలో రూ.65 నుంచి రూ.70 వరకూ పలుకుతోంది. ప్రభుత్వం రైతుబజార్ల ద్వారా రూ.20 లకే సరఫరా చేస్తున్నా, అవన్నీ గృహ అవసరాలకే సరిపోవడం లేదు. ఇక హోటళ్లు, టిఫిన్ సెంటర్లకు ఎక్కడ దొరుకుతాయని పలువురు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. 
 
అధిక ధర పెట్టి ఉల్లిపాయలు కొని ఉల్లి దోసెను అందుబాటులో ఉంచాలంటే ప్రస్తుతం ఉన్న దోసె రేటును రెట్టింపు చేయాల్సి ఉంటుందనీ, ఆ విధంగా రేటు పెంచితే కస్టమర్లు రారని, దీంతో వాటికివిరామం ఇచ్చామని చెబుతున్నారు.