గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వాసు
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (17:40 IST)

జనసేనలో మొదలైన రాజీనామాల పర్వం...

జనసేన.. హఠాత్తుగా... ఏదో నిరసనల మధ్య మొదలై నిన్న మొన్నటి వరకు ఏవో సంచలనాలతో... పార్టీలో చేరాలంటే ఇంటర్వ్యూలనీ.. అవనీ ఇవనీ వినూత్న పద్దతిలో ముందుకు సాగిపోతూండిన పార్టీ అయితే అందులో కూడా ఇతర పార్టీలలో టిక్కెట్‌లు రాని వారు వచ్చి చేరడం వారికే టిక్కెట్లు ఇవ్వడంతో అసంతృప్తితో రాజీనామాల పర్వం మొదలైంది.
 
జనసేన పార్టీ అభ్యర్థుల జాబితాని ప్రకటించిన కొద్ది సేపటికే... అసంతృప్తికి గురైన వారు రాజీనామాల పర్వం మొదలెట్టేసారు. పశ్చిమగోదావరి జిల్లా కో కన్వీనర్ యర్రా నవీన్ పార్టీకి రాజీనామా చేశారు. అభ్యర్థులను ఎంపిక చేయడంలో.. పార్టీ నిర్ణయంపై అసంతృప్తి చెందడమే ఆయన రాజీనామాకి కారణంగా తెలుస్తోంది. పార్టీలో కష్టపడినవారికి కాకుండా.. ఇతర పార్టీల్లో టికెట్లు దక్కనివారు జనసేనలో చేరితో వారికి టిక్కెట్లు ఇవ్వడం సరైనది కాదని ఈ సందర్భంగా యర్రా నవీన్‌ వ్యాఖ్యానించారు.
 
కాగా ఇవాళ జనసేన ఆవిర్భావదినోత్సవ సభ రాజమండ్రిలో జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ సభ నుండి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఇప్పటికే జనసేన నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూండగా... ఉభయ గోదావరి జిల్లాలతోపాటు రాష్ట్రం నలుమూలల నుండి జనసేన సైనికులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు సభ జరగనుంది. ఈ సందర్భంగా పవన్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
 
మరి ఈ రాజీనామాల పర్వానికి ముగింపుగా బుజ్జగింపులు, ఓదార్పులు పవన్ వినూత్నంగా ఎలా చేపడ్తాడో చూద్దాం...