ఒంగోలులో సెటిల్మెంట్ల లెక్చరర్ కటకటాలపాలు!
జిల్లా కేంద్రమైన ఒంగోలులో సెటిల్మెంట్లకు పాల్పడుతున్న ఓ లెక్చరర్ను పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఈ లెక్చరర్ తనకు బడా రాజకీయ నేతలు, అధికారులతో సంబంధం ఉందంటూ ఈ సెటిల్మెంట్ దందాలకు శ్రీకారంచుట్టి జైలుపాలయ్యాడు.
తాజాగా వెలుగుచూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఏలూరుకు చెందిన గౌస్ మొహిద్దీన్ అనే లెక్చరర్ ఒంగోలులోని ఓ కాలేజీ పని చేస్తున్నాడు. ఈయన తనకు అధికారులతో పరిచయాలున్నాయంటూ సెటిల్మెంట్లకు పాల్పడ్డాడు. పైపెచ్చు... పోలీస్ శాఖలో ఉద్యోగాలిప్పిస్తానంటూ పలువురిని మోసం చేశాడు.
ఒంగోలుకు చెందిన సూర్యప్రకాశరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు గౌస్ మొహద్దీన్ను ఏలూరు రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. గతరాత్రి నుంచి అతని నివాసంలో సోదాలు జరిపిన పోలీసులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.