బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 జూన్ 2020 (11:12 IST)

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర పరిస్థితి... తెలంగాణాకు ఓకే.. ఆంధ్రాకు మాత్రం నో!

రెండు తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్రం విధించిన నాలుగు దశల లాక్టౌన్ మే 31వ తేదీతో ముగిసింది. ఆ తర్వాత జూన్ 30వ తేదీ వరకు లాక్డౌన్ పొడగించినప్పటికీ.. అనేక సడలింపులు ఇచ్చింది. పైగా, ఈ నెల 8వ తేదీ నుంచి కూడా ఆలయాలను తెరుచుకోవచ్చని తెలిపింది. అలాగే, అంతర్రాష్ట్ర రాకపోకలు కూడా సాగించవచ్చని పేర్కొంది. ఇందుకోసం ఎలాంటి పాస్‌లు అక్కర్లేదని తెలిపింది. కేంద్రం ఆదేశాలను అనేక రాష్ట్రాలు పాటిస్తున్నాయి. అందులో ఒకటి తెలంగాణ కూడా ఉంది. 
 
కానీ, ఆంధ్రప్రదేశ్ మాత్రం పెడచెవిన పెట్టింది. లాక్డౌన్ ఆంక్షలను కొనసాగించనుంది. అంతర్రాష్ట్ర రాకపోకలపై కూడా ఆంక్షలు కొనసాగుతోంది. అలాగే, వ్యక్తిగత ప్రయాణాలపై కూడా ఈ షరతులు కొనసాగనున్నాయి. ముఖ్యంగా, ఏపీలో అడుగుపెట్టాలంటే ఖచ్చితంగా స్పందన పోర్టల్ ద్వారా ఈ-పాస్ పొందాల్సిందేనని షరతు విధించింది. మరోవైపు, తెలంగాణా రాష్ట్ర మాత్రం ఆంక్షలన్నీ తొలగిచింది. ఈ పరిస్థితి తెలుగు రాష్ట్రాల మధ్య ఉండటంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. 
 
నిజానికి ఇరు రాష్ట్రాల మధ్య ప్రతి రోజూ లక్షలాది మంది రాకపోకలతో, వేలాది బస్సులు, రైళ్లు, సొంత వాహనాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సాగే ప్రయాణాలు, అన్ లాక్ 1.0లో భాగంగా కేంద్రం అనుమతించినా, ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆంక్షలతో విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. తెలంగాణకు వచ్చే వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకున్నా, ఏపీకి వెళ్లాలంటే మాత్రం ఆంక్షల చట్రం అడ్డుకుంటోంది.
 
అన్ని రాష్ట్రాల నుంచి తెలంగాణకు ప్రయాణికులను అనుమతిస్తుండగా, ఏపీకి వెళ్లాలంటే మాత్రం ఈ-పాస్ తప్పనిసరి కానుంది. అంతరాష్ట్ర రాకపోకలపై కేంద్రం నిషేధాన్ని ఎత్తివేసిన వెంటనే, తెలంగాణ ప్రభుత్వం అందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. బస్సు ప్రయాణికులకు రాత్రి పూట కర్ఫ్యూ నుంచి కూడా ఉపశమనాన్ని కేసీఆర్ సర్కారు కల్పించింది. బస్టాండ్లలోకి ఆటోలు, క్యాబ్‌లకు కూడా అనుమతిచ్చింది.
 
కానీ, ఏపీ మాత్రం ఇంకా ఆంక్షలను సడలించ లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేంత వరకూ తమ రాష్ట్రానికి వచ్చే వారు క్వారంటైన్ నిబంధనలకు అనుగుణంగా నడచుకోవాల్సిందేనని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఇక తెలంగాణ ఆర్టీసీ ఆన్‌లైన్ బుకింగ్ సేవలను కూడా ప్రారంభించింది. రాష్ట్రం నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి ప్రాంతాలకు అన్ని రకాల సర్వీసులకూ రిజర్వేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఏపీకి మాత్రం ఇంకా రిజర్వేషన్లు ప్రారంభం కాలేదు.