శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2019 (08:07 IST)

బంగాళాఖాతంలో అల్పపీడనం .. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు... ఉత్తర తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే, కోస్తాంధ్రకు సమీపంలో గురువారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 
 
కాగా, మంగళవారం ఉదయం 8:30 గంటల నుంచి బుధవారం రాత్రి 8:30 గంటల వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నల్గొండలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఆగకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 
 
భారీ వర్షం కారణంగా యాదాద్రి కొండపై చేపట్టిన అభివృద్ధి పనులకు ఆటంకం కలిగింది. కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీకి బుధవారం సాయంత్రం ఎగువ ప్రాంతం నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో 16 గేట్ల ద్వారా 1.20 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.
 
సరస్వతి బ్యారేజీ వద్ద 11 గేట్లను ఎత్తి 49,500 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఇక, నాగార్జునసాగర్‌కు బుధవారం రాత్రి 7 గంటల సమయంలో 68,430 క్యూసెక్కుల ప్రవాహం రాగా 4 గేట్లను ఐదు అడుగులు ఎత్తి 32,440 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 
 
ఏపీలో రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు.. నెల్లూరు, ఉత్తర తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి దట్టమైన మేఘాలు ఆవహించగా, గురువారం వేకువజాము నుంచి వర్షం పడుతోంది.