శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (15:29 IST)

అనుమానం పెనుభూతమైంది.. భార్యను కొబ్బరిబొండాలు నరికే కత్తితో కుళ్లబొడిచాడు...

అతనికి అనుమానం పెనుభూతమైంది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న అతను... చివరకు భార్యను కొబ్బరిబొండాలు నరికే కత్తితో శరీరమంతా పొడిచాడు. ఈ ఘటనలో అడ్డొచ్చిన తొమ్మిదేళ్ళ కుమారుడిని కూడా హత్య చేశాడు. భర్త దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య ఆస్పత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఆ తర్వాత తాను కూడా ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పశ్చిమ గోదావరి జిల్లా వసంతవాడకు చెందిన రుద్రరాజు సుబ్బరాజు (47) అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి వలసపోయాడు. అక్కడ ఓ పరిశ్రమలో పనిచేస్తూ జీవినం సాగిస్తున్నాడు. అయితే, ఈయన గతంలో ఓ హత్య కేసులో జైలుశిక్ష కూడా అనుభవించాడు. తొలి భార్య ప్రవర్తన సరిగా లేదని ఆరోపిస్తూ ఆమెకు విడాకులు ఇచ్చాడు. 
 
ఈ క్రమంలో గత యేడాది పశ్చిమ గోదావరి జిల్లా దువ్వ గ్రామానికి చెందిన చెందిన లక్ష్మీజ్యోతి అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే పెళ్లయిన ఆమెకు చైతన్య అనే తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. పెళ్లి తర్వాత పటాన్‌చెరు మండలం చిట్కుల్‌లోని నాగార్జున కాలనీలో కాపురం పెట్టారు.
 
అయితే, సుబ్బరాజు తనలోని అనుమానపు బుద్ధిని మాత్రం విడిచిపెట్టలేదు. భార్యపై అనుమానం పెంచుకున్న సుబ్బరాజు ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అమె ప్రవర్తన అనుమానంగా ఉందంటూ తన డైరీలోనూ రాసుకోవడం విశేషం. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన భార్యతో మరోమారు ఇదే విషయమై గొడవపడ్డాడు. 
 
ఆమె నిద్రపోయిన తర్వాత కొబ్బరి బొండాల కత్తితో ఆమెపై దాడి చేశాడు. కత్తివేటుకు ఆమె స్పృహతప్పి పడిపోయింది. దీన్ని చూసిన తొమ్మిదేళ్ళ కుమారుడు సుబ్బరాజును అడ్డుకునే ప్రయత్నం చేయగా, అతనిపైనా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఆ తర్వాత భార్య, బాలుడు చనిపోయిందని నిర్ధారించుకున్న సుబ్బరాజు గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరేసుకున్నాడు. ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న జ్యోతిని గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే జ్యోతి, ఆమె కుమారుడిని ఆసుపత్రికి తరలించారు. జ్యోతి ప్రాణాలతో పోరాడుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.