గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

వెలుగులోకి వస్తున్న వైకాపా మాజీ మంత్రి విడదల రజినీ అవినీతి లీలలు!

vidadala rajini
గత వైకాపా ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విడదల రజినీ మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అవినీతి ఇపుడు వెలుగులోకి వచ్చింది. నిజానికి అధికారంలో ఉన్న సమయంలోనే ఈమె చేసిన అవినీతి గురించి విస్తృతంగానే ప్రచారం జరిగింది. అయితే, ఆమెకు మాజీ సీఎం జగన్ అడ్డుకట్ట వేయలేదు. అప్పట్లో బాధితులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక అల్లాడారు. ప్రభుత్వం మారడంతో వారంతా బయటకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, పోలీసులతో చెప్పుకొంటున్నారు. 
 
జగనన్న కాలనీ పేరిట తమవద్ద భూములు సేకరించి కమీషన్ వసూలు చేశారని, అవి ఇప్పించాలని జూన్ నెలలో చిలకలూరిపేట మండల రైతులు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు మొరపెట్టుకున్నారు. చిలకలూరిపేట మండలం పసుమర్రుకు, గుడిపూడి గ్రామాల రైతుల నుంచి 200 ఎకరాలను మాజీమంత్రి రజినీ అనుచరులు సేకరించారు. 32 మంది నుంచి తొలుత 50 ఎకరాలు సేకరించారు. ఈ వ్యవహారంలో తమకు రజినీ నుంచి రూ.1.16 కోట్లు రావాల్సి ఉందని రైతులంతా పోలీసులు, ఎంపీకి విన్నవించుకోగా, ఆ మొత్తాన్ని ఇప్పించారు. 
 
మాజీమంత్రి రజినీ రంగంలోకి దిగి రూ.5 కోట్లు ఇవ్వాలని.. లేకపోతే వ్యాపారం ఎలా చేస్తావో చూస్తానని తనను బెదిరించారని ఓ స్టోన్ క్రషర్ యజమాని పోలీసులకు తాజాగా ఫిర్యాదుచేశారు. తనతోపాటు మరో ముగ్గురు కలిసి స్టోన్ క్రషర్ నడిపిస్తుంటే మాజీమంత్రి రజినీ బెదిరించారని యడ్లపాడుకు చెందిన నల్లపనేని చలపతిరావు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. 
 
ఆమెకు వత్తాసుగా అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా కూడా డబ్బులు ఇవ్వకపోతే రూ.50 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని బాధితులను వేధించారు. దీంతో చేసేదిలేక రూ.2.20 కోట్లు రజినికి, ఆమె అనుచరులకు ఇచ్చామని, వాటిని తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. ఇదే విధంగా పలువురు బాధితులు రజినీ ఆగడాలపై ఫిర్యాదులు చేసేందుకు ముందుకు వస్తున్నారు.