శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2019 (18:45 IST)

యువతలో నైపుణ్యం పెంచేందుకు చర్యలు: మంత్రి ముత్తంశెట్టి

యువతలో నైపుణ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.

మంగళవారం వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా భారీగా ఉద్యోగాలిచ్చామన్నారు. భారతదేశంలో 60 శాతం మంది యువత ఉండగా, మన రాష్ట్రంలో అత్యధిక మంది యువత ఉండటం విశేషమన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన  నాలుగున్నర లక్షల ఉద్యోగాలకు 22 లక్షల మంది యువత దరఖాస్తు చేసుకున్నారని గుర్తుచేశారు.

19 లక్షల మంది యువత పరీక్షలకు హాజరయ్యారన్నారు. దీని ద్వారానే రాష్ట్రంలో  యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించామనడానికి  ఇదే నిదర్శనమన్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న యువత కోసం వ్యక్తిత్వ వికాస(పర్సనాలిటీ డెవలప్ మెంట్) అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని ప్రకటించారు.

ప్రతి ఒక్కరూ మంచి వ్యక్తిత్వాన్ని, నైపుణ్య వికాసాన్ని కలిగి ఉండటం అవసరమన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ జీవన విధానాన్ని మార్పు చేసుకోవాల్సిన ఆవశ్యకతను మంత్రి గుర్తుచేశారు. ఇటీవల జరిగిన అనేక ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా క్రీడలు, వ్యక్తిత్వ వికాస, నైపుణ్య వికాసాలను యువతలో పెంపొందించేందుకు పెద్దఎత్తున కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.

యువతలో మనోధైర్యం నింపే ప్రయత్నం చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందు కోసం ప్రతి డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో క్రీడా సాంస్కృతిక అంశాలకు పెద్ద పీట వేసి కార్యక్రమాలను చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక క్యాలెండర్ ను రూపొందించామన్నారు. యువతలో మార్పు తెచ్చి రుగ్మతలను నియంత్రించేందుకు స్కూలు, కాలేజీ,వర్సిటీల్లోని యువతకు అవగాహన కల్పించే కార్యక్రమాలను రూపొందించామన్నారు.

ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక స్పృహ సమాజంలో కల్పించాలనే ఉద్దేశంతో భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ దేశ పురోగతికి యువత కారణమన్నారు. యువజన సర్వీసుల ద్వారా మంచి కార్యక్రమాలను చేస్తున్నామని పేర్కొన్నారు.

ఈ మేరకు 13 జిల్లాల సీఈవోలతో ప్రత్యేక సమీక్ష కార్యక్రమం నిర్వహించి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నామన్నారు. సామాజిక సేవల కింద కార్యక్రమాలను రూపొందించి ఇప్పటికే 5 జిల్లాల్లో సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలను నిర్వహించామన్నారు.

నేషనల్ ఇంటిగ్రేషన్ డే – యూత్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలు యువతలో మార్పును తీసుకువస్తాయన్న అంశాలను సంబంధిత అధికారులు తెలియజేశారని పేర్కొన్నారు. యువత పెడదోవ పట్టకుండా ఉండేందుకు నైతిక విలువలను పెంపొందించేందుకు కార్యక్రమాలను రూపొందించి కొనసాగిస్తున్నామన్నారు.

ఇందులో భాగంగా వైఎస్సార్ క్రీడా ప్రోత్సాహకాల కింద రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2, 2014 నుండి ఇప్పటి వరకు  860 మంది అథ్లెటిక్ క్రీడాకారులకు 2 కోట్ల 7 లక్షల 38 వేల 582 రూపాయలు నిధులు విడుదల చేశామన్నారు. ఇందులో జూనియర్, సబ్ జూనియర్స్ కు సంబంధించి జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జరిగే పోటీల్లో బంగారు పతకం (గోల్డ్ మెడల్) సాధించే విజేతకు గతంలో రూ.3 లక్షలు ప్రోత్సాహక బహుమతి ఇస్తుండగా వాటిని రూ. 5 లక్షలకు పెంచామన్నారు.

అదే విధంగా వెండి పతకం (సిల్వర్ మెడల్) సాధించే విజేతకు గతంలో రూ. 2 లక్షలు ఇస్తుండగా ప్రస్తుతం వాటిని రూ.4 లక్షలకు పెంచామన్నారు.  జాతీయస్థాయిలో సీనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో గతంలో బంగారు పతకానికి లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకం అందిస్తుండగా దానిని లక్షా పాతిక వేల రూపాయలకు పెంచామన్నారు. అలాగే వెండి పతకం కింద రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు పెంచామన్నారు.

ఇప్పటికే గుంటూరు 35వ నేషనల్ జూనియర్ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీలు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించామన్నారు. 27 రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్ నుంచి కూడా క్రీడాకారులు హాజరుకావడం విశేషమన్నారు. నవంబర్ 16వ తేదీ నుంచి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పురుషులు మరియు స్త్రీలకు వేరువేరుగా సీఎం కప్ నెట్ బాల్ టోర్మమెంట్  నిర్వహిస్తామన్నారు.

అదే విధంగా నవంబర్ 23వ తేదీ నుంచి చిత్తూరు జిల్లా తిరుపతిలో నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్ మీట్ జరుగుతుందన్నారు. నవంబర్ 28వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పురుషులు మరియు స్త్రీలకు వేరువేరుగా సీఎం కప్ త్రోబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఇప్పటివరకు రాష్ట్రంలోని 5 జిల్లాల్లో పోటీలను నిర్వహించామని మరో 8 జిల్లాల్లో పూర్తయిన తర్వాత అన్నింటిని కలిపి రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తామన్నారు. విజేతలకు డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రోత్సాహక బహుమతులుంటాయని పేర్కొన్నారు.దీంతో పాటు జాతీయస్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వం క్రీడా పోటీలను నిర్వహిస్తుందన్నారు.

మహిళలు కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలను కూడా యువజన శాఖ సర్వీసుల ద్వారా చేపట్టనున్నట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమావేశంలో ప్రస్తావించారు. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ సమాజం అభివృద్ధి చెందుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

పోలీసులు, ఎన్జీవోలు, స్కూల్స్ లో మహిళల ఆత్మరక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్ ఇతర అధికారుల సహకారం తీసుకొని  ప్రజల్లో మార్పు తీసుకువస్తామన్నారు. చట్టాలపై సామాజిక స్పృహ కలిగేలా యువత నడుచుకోవాలని సూచించారు. ఉద్యమంలా ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు.

ప్రభుత్వ విద్యా సంస్థలతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థల్లో యువత పెడధోరణి పట్టకుండా తగు చర్యలు తీసుకుంటాన్నారు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో మార్పు తీసుకువస్తామన్నారు. “కర్మ సిద్ధాంతం లేనిదే కాంతివంతమైన జీవితం లేదు”అని  మంత్రి హితబోధ చేశారు.

13 జిల్లాల్లో క్రీడల అభివృద్ధి కోసం మూడు రకాల విధానాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయని మంత్రి అన్నారు. మౌలిక వసతులు లేని క్రీడా మైదానాలను గుర్తించి ప్రణాళికలు తయారు చేసి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్, తాగునీరు, మౌలిక వసతుల కల్పనకు నిధులను విడుదల చేస్తామన్నారు.

అందుకోసం ప్రణాళికలు తయారుచేయాలని అధికారులకు సూచించినట్లు మంత్రి వెల్లడించారు. 25 శాతం పనులు జరిగిన క్రీడా మైదానాల్లో బకాయిలు పడ్డ నిధులను చెల్లించడం జరుగుతుందన్నారు. త్వరితగతిన మిగతా పనులు పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.

గ్రామీణ ప్రాంత క్రీడా కారుల ప్రోత్సాహకానికి ఎన్ని నిధులు అయినా విడుదల చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగీకరించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఇటీవల తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడిన విషయాన్ని ప్రస్తావించారు.

యువత ప్రతి చిన్న విషయానికి ఒత్తిడికి గురవుతున్నారని, వారికి విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహించడం ద్వారా మార్పుకు నాంది పలకవచ్చన్నారు.  విద్యతో పాటు క్రీడలను ఆదరించి యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి ఇటీవల తమకు తెలిపారన్నారు. 

క్రీడలు, యువజన శాఖల ద్వారా సంస్కృతి సంప్రదాయాలను గౌరవించే కార్యక్రమాలను చేపట్టి రానున్న నాలుగున్నరేళ్లలో సమగ్ర అభివృద్ధిని సాధిస్తామన్నారు.

ఇందుకోసం నెహ్రూ యువ కేంద్రాలు, రాష్ట్ర స్థాయి క్రీడా అసోసియేషన్ ను కలుపుకొని క్రీడా మరియు యువజన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో క్రీడల యువజన శాఖ డైరెక్టర్ నాగరాణి, అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు పాల్గొన్నారు.