1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 16 మార్చి 2024 (17:45 IST)

రాజోలు రాపాకపై పేలుతున్న మీమ్స్; మనకెందుకన్న నిన్నందరూ చూసి పిచ్చోడనుకుంటున్నారే

Rapaka Vara Prasada Rao
రాపాక వరప్రసాదరావు. జనసేన నుంచి గత ఎన్నికల్లో ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే. రాజోలు నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. ఐతే ఆ తర్వాత క్రమంగా జనసేనకు దూరమై జగన్ మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. వైసిపి పాలనను పొగడ్తల జల్లుతో ముంచెత్తారు. ఇక ఇప్పుడు పోలింగ్ టైమ్ వచ్చేసింది. ఈ టైంలో ఆయన గెలిచిన రాజోలు నుంచి వైసిపి ఆయనకు టిక్కెట్ కేటాయించలేదు. దీనితో ఆయనపై నెటిజన్లు మీమ్స్ పెడుతూ ఫన్నీ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.


అందుకు నేను ఒప్పుకోను...
ఏపీలో సీట్ల రగడ ప్రతి ఒక్క పార్టీకి తలనొప్పిగా మారుతోంది. తాజాగా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపికి ఈ తలనొప్పి ప్రారంభమైంది. గత ఎన్నికల్లో జనసేన తరపున గెలిచిన ఒకే ఒక్క సీటు ఇదే. ఈ స్థానం నుంచి రాపాక వరప్రసాదరావు జనసేన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కొద్దిరోజులకే వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. ఇక అప్పట్నుంచి అధికార పార్టీతోనే నడుస్తూ వచ్చారు.
 
ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సీఎం జగన్ మోహన్ రెడ్డి సిట్టింగ్ స్థానాల్లో పోటీ చేసేవారిలో కొందరికి ఉద్వాసన పలుకుతున్నారు. వారిలో రాపాక కూడా చేరిపోయారు. ఆయన పోటీ చేసిన రాజోలు నుంచి ఇటీవలే తెదేపా నుంచి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుని పోటీకి దింపుతూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రాపాక తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
 
ఓడిపోయే అభ్యర్థిని తీసుకుని వచ్చి రాజోలు నుంచి పోటీ చేయిస్తే చూస్తూ వూరుకునేది లేదని చెబుతున్నారు. మరొక్కసారి సర్వే చేయించి గెలిచేది ఎవరో చూసి అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. తనను అమలాపురం ఎంపీగా పోటీ చేయమని చెబుతున్నారనీ, దానికి నేను సిద్ధమే కానీ రాజోలులో ఓడిపోయే అభ్యర్థిని దింపితే మాత్రం సహించలేమని అంటున్నారు. అవసరమైతే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమేనంటూ తెలియజేస్తున్నారు.