శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 జులై 2014 (17:23 IST)

ఆత్మాభిమానం చంపుకుని వైకాపాలో ఉండలేను: కొత్తపల్లి గీత

ఆత్మాభిమానం చంపుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనని ఆ పార్టీ అరకు లోక్ సభ సభ్యురాలు కొత్తపల్లి గీత స్పష్టం చేశారు. తద్వారా కొత్తపల్లి గీత పార్టీ వీడడం ఖాయమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీ గీత మీడియా ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథాన పురోగమిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. తద్వారా ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారని తేలిపోయింది. 
 
ఇంకా అరకులో ఆమె మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ నేతలు తనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచారన్నారు. పార్టీలోని నేతలు పార్టీ చేపట్టే కార్యక్రమాలపై కనీస సమాచారం ఇవ్వడం లేదని గీత వెల్లడించారు. పార్టీలో తన ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారని,  ఎస్టీ మహిళనని తనను చాలా అవమానించారని చెప్పారు.  
 
వైఎస్సార్సీపీ నేతల వ్యవహార శైలితో మహిళా నేతలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని గీత తెలిపారు. త్వరలో చాలా మంది మహిళా నేతలు వైఎస్సార్సీపీ వీడుతారని ఆమె అభిప్రాయపడ్డారు.