గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 నవంబరు 2019 (10:38 IST)

ఎమ్మార్వో హత్య - నిందితుడు మృతి.. విజయారెడ్డి వల్లే రోడ్డున పడ్డాం..

ఎమ్మార్వో విజయారెడ్డి హత్యకేసులో నిందితుడు సురేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. విజయారెడ్డిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన సురేష్.. ఈ క్రమంలో తనపై కూడా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కాలిన గాయాలతో ఉన్న సురేష్‌ను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 
 
65 శాతం కాలిన గాయాలతో ఉన్న సురేష్‌కు ఉస్మానియాలో చికిత్స అందించారు. న్యూరోబర్న్ షాక్‌లో ఉన్న సురేష్ పరిస్థితి బుధవారం మరింత విషమించింది. దీంతో సురేష్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. కొంతకాలంగా భూ పట్టా కోసం తహశీల్దార్ చుట్టూ తిరిగానని సురేష్ తెలిపాడు. విజయారెడ్డి చేసిన అన్యాయం వల్ల తమ కుటుంబం రోడ్డున పడిందని అన్నాడు. ఈ కారణంగానే ఆమెపై కక్ష పెంచుకున్నానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. లీటర్ పెట్రోల్ కొనుక్కుని బ్యాగ్‌లో ముందే పెట్టుకున్నానని అన్నాడు. 
 
మరోసారి భూమి పట్టా కోసం విజయారెడ్డిని వేడుకున్నానని... పట్టాలేదని చెప్పడంతో పెట్రోల్ పోసి తగులపెట్టానని వివరణ ఇచ్చాడు. కానీ అతని ఆరోగ్య పరిస్థితి విషమించి సురేష్ గురువారం ఉదయం చనిపోయాడు. ఇక విజయారెడ్డి హత్య సందర్భంగా తీవ్రంగా గాయపడిన ఆమె కారు డ్రైవర్ గురునాథం కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉంటే తన భర్తను ఎవరో పావులా వాడుకున్నారని తహశీల్దార్ హత్య కేసులో నిందితుడు సురేష్ భార్య లత ఆరోపిస్తోంది. తన భర్త ఇలాంటి ఘోరాలు చేసే వ్యక్తి కాదని.. చాలా అమాయకుడని చెబుతోంది. వివాదానికి సంబంధించిన భూమి విషయమే తమకు తెలియదని లత చెప్తోంది.