నాయిని కామెంట్: బంగారు తెలంగాణను ఆచరణలో..
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం బంగారు తెలంగాణను ఆచరణలో చేసి చూపిస్తుందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తూ.చ తప్పకుండా అమలు చేస్తుందని నర్సింహారెడ్డి హామీ ఇచ్చారు.
తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలపడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాంధీ జయంతి నుంచి ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలోని మద్నూర్ మండల కేంద్రంలో రూ. 1.08కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో అన్ని స్థానాల్లో టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకంతో మమ్మల్ని గెలిపించిన ప్రజలకు అక్టోబర్ 2నుంచి సంక్షేమ పథకాలు అందనున్నాయని నాయిని చెప్పారు.