గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 మే 2020 (09:19 IST)

ఏడు కొండలే లేవన్నోళ్ళు.. ఇపుడు నీ చెంతనే బర్త్‌డే వేడుకలా.. నారా లోకేశ్

తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ కారణంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. అంటే, భక్తులకు దర్శనాలు పూర్తిగా బంద్ చేశారు. కానీ, నిత్య కైంకర్యాలు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిల్లో వైవీ సుబ్బారెడ్డి పుట్టిన రోజు వేడుకలు తిరుమల శ్రీవారి క్షేత్రంలో జరిగాయి. ఈ సందర్భంగా తితిదే ఛైర్మన్ తన కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో నారా లోకేశ్ స్పందించారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
'ఆపద మొక్కుల వాడా, అనాథ రక్షకా! నీకు పేద, ధనిక అనే తేడా లేదంటారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ కాలంలో సామాన్యులకు నీ దర్శన భాగ్యమే లేదు, కానీ వైస్ తోడల్లుడు సకుటుంబ సమేతంగా వచ్చేసరికి నీ గుడి తలుపులు ఎలా తెరిచారయ్యా!' అంటూ లోకేశ్ ట్విట్టర్‌లో కామెంట్ చేశారు. 
 
అంతేకాకుండా, 'దేవదేవుడి ఉత్సవాలతో అలరారిన తిరుమల గిరులు నిర్మానుష్యంగా మారినవేళ, నిబంధనలు తుంగలో తొక్కి నీ సన్నిధిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అపరాధం కాదా! ఏడుకొండలే లేవన్నోళ్లు నువ్వున్నావంటే నమ్ముతారా? నీ కొండను నువ్వే కాపాడుకో స్వామీ!' అంటూ వ్యాఖ్యానించారు.
 
తనను లక్ష్యంగా చేసుకుని నారా లోకేశ్ చేసిన విమర్శలకు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కౌంటరిచ్చారు. 'నారా లోకేశ్... ప్రతి శుక్రవారం శ్రీవారికి జరిగే అభిషేకానికి రెండు వారాలకు ఓసారి టీటీడీ ఛైర్మన్ హాజరవడం ఆనవాయితీ. నేను కూడా ఆ హోదాలోనే వెళ్లాను. ఆ ఫొటోలో నా తల్లిగారు, నా అర్థాంగి, తితిదే ఉద్యోగులు తప్ప నా బంధువులెవరూ లేరు. నీ ట్వీట్ అబద్ధం. ఇప్పటికైనా తప్పు తెలుసుకో. కొంచెమైనా పాప భీతి ఉండాలి' అంటూ హితవు పలికారు.