గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 26 అక్టోబరు 2019 (17:39 IST)

రైతుకు సాయం లేదు.. మాజీ మంత్రి దేవినేని

రాష్టీంలో 5 నెలలుగా ఇసుక లేక 30 లక్షల మంది భవననిర్మాణ రంగ కార్మికులు ఆకలి మంటలతో అల్లాడుతుంటే, ఇద్దరు నిర్మాణ కార్మికులు పనులు లేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి చీమ కుట్టినట్లైనా లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

శనివారం నాడు మూలపాడు, కొటికలపూడి గ్రామాల పరిధిలో వరద నీటిలో మునిగిన పంట పొలాలను, కృష్ణా నది వరద ఉధృతిని పరిశీలించారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేనందునే రైతులు తమ పంట పొలాలను, కాయకష్టాన్ని కోల్పోవాల్సివస్తుందని తెలిపారు. 

హెలికాప్టర్ లో కర్నూల్ వెళ్లి అక్కడి రైతులను పరామర్శించిన ముఖ్యమంత్రి కి తన నివాసానికి దగ్గర ఉన్న కృష్ణానది ఏటొడ్డు గ్రామాల్లోని రైతుల పంట పొలాలను పరిశీలించడానికి తీరిక లేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వ పాలనలో చెప్పిన దానికి, చేస్తున్న దానికి ఎంతో వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు.

ఇచ్చిన భరోసా ప్రకారం రైతుకు సాయం ఇవ్వడం లేదని రివర్స్ టెండరింగ్ విధానంతో అభివృద్ధి కార్యక్రమాలన్నింటికి రివర్స్ గేర్ వేశారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపరాదాలతోనే రెండేళ్లు వెనకబడ్డదని చెప్పారు.

తక్షణమే సంబంధిత మంత్రులు, ముఖ్యమంత్రి నీట మునిగిన పంట పొలాలు పరిశీలించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని దేవినేని ఉమా డిమాండ్ చేసారు.