1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 24 ఆగస్టు 2019 (19:27 IST)

అమరావతి ప్రజల కోసం కాదు.. మంత్రి బొత్స

రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి ప్రజల కోసం నిర్ణయం తీసుకోలేదన్నారు. అది కొందరి ప్రయోజనాల కోసమే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటీని కాదని.. నారాయణ కమిటీ ఆధారంగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అమరావతిలో నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని గతంలోనే చెప్పామన్నారు. ఇప్పుడూ అదే చెబుతున్నట్లు స్పష్టం చేశారు.

8 లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే రాజధాని మునిగిపోతే.. ఒకవేళ పదేళ్ల క్రితం వచ్చినట్లు మళ్లీ వరద వస్తే అమరావతి ఏమవుతుంది? అని ప్రశ్నించారు. ఇటీవల రాజధానిపై బొత్స చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.

త్వరలో అమరావతిపై ఓ నిర్ణయం తీసుకుంటామన్న ఆయన వ్యాఖ్యలు అలజడి సృష్టించాయి. దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. అమరావతిపై ఏదో ఒకటి తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రాజధాని రైతులు కూడా పోరాటానికి సిద్ధపడుతున్నారు.

విపక్షాల మద్దతు కూడబెడుతున్నారు. ఇదిలా ఉంటే సీఎం జగన్ అమెరికా పర్యటన ముగించుకుని శనివారం తాడేపల్లి చేరుకున్నారు. ఈ తరుణంలో మరోసారి బొత్స చేసిన వ్యాఖ్యలను బట్టి రాజధానిపై ఏదో జరుగుతుందన్న సందేహం రాజకీయ వర్గాల్లో నెలకొంది.