శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 2 మార్చి 2015 (11:02 IST)

పవన్ గుంటూరు జిల్లా తుళ్లూరు పర్యటన వాయిదా!

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమ, మంగళ వారాల్లో గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంత గ్రామాలలో పర్యటించాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ తమ ప్రాంతంలో పర్యటించబోతున్నారని తెలిసి ఆ ప్రాంతంలో రైతులు సర్వ సన్నాహాలూ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారని సమాచారం అందుతోంది. 
 
వాస్తవానికి ఆ ప్రాంత రైతుల విజ్ఞప్తి మేరకు ఆయన సోమవారం రాజధాని నిర్మాణ ప్రతిపాదిత గ్రామాల్లో సోమవారం పర్యటించాలని భావించారు. అయితే ఆ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 5వ తేదీన పవన్ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. కాగా బడ్జెట్లో  ఏపీకి అన్యాయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన తర్వాత పవన్ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.
 
రాజధాని కోసం రైతులనుంచి పంట భూములను సమీకరించడంపై ట్విట్టర్‌లో పవన్ ఇటీవల తీవ్రంగా స్పందించడం తెలిసిందే. 'ఎంతో నమ్మకంతో ప్రజలు బీజేపీ-టీడీపీ కూటమిని గెలిపించారు. వారు చూపించిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నా. రైతులు కన్నీరు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉంది. లేదంటే వారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. కొత్త రాజధాని నిర్మాణంలో రైతులు, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత జీవనం ధ్వంసం కాకుండా చూడాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపైనే ఉంది' అని పవన్ ట్వీట్ చేయడం విదితమే.