శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: సోమవారం, 2 మార్చి 2015 (08:19 IST)

ఏపీ సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ.. రాష్ట్రానికి నిధుల కోసమే..

రాష్ట్రానికి నిధులు రాబట్టడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సాయం కోరారు. ఆదివారం పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి దాదాపు ఒకటిన్నర గంటసేపు చర్చించారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందనీ, రాష్ట్రానికి నిధులు తెప్పించే విధంగా కేంద్రాన్ని ఒప్పించాలని బాబు పవన్ ను కోరారు. అందుకు పవన్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. 
 
విభజన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం ఇచ్చిన హామీలు వాటి అమలు తీరు తదితర అంశాలను చంద్రబాబు పవన్‌కు విపులంగా వివరించారు. 14వ ఆర్థిక సంఘం విశ్లేషణ ప్రకారం వచ్చే ఐదేళ్లలో ఏపీకి పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి రాషా్ట్రలు లక్ష కోట్లకు పైగా మిగులుతో ఉంటే మన రాష్ట్రం మాత్రం అప్పటికీ లోటులోనే ఉంటుందని వివరించారు. బొటాబొటీ ఆదాయంతో కొత్త రాషా్ట్రన్ని ఎలా అభివృద్ధి చేయగలమని ఆయన ప్రశ్నించారు. 
 
రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరం ఏపీకి రూ. 16 వేల కోట్ల లోటు ఉంటుందని గవర్నర్‌ అధికారకంగా కేంద్రానికి నివేదిక పంపిస్తే, అందులో కేంద్రం కేవలం రూ. 500 కోట్లు మాత్రమే ఇచ్చిందని చంద్రబాబు చెప్పారు. మొదటి బడ్జెట్‌లో రాజధాని నిర్మాణానికి రూ.500 కోట్లు పెట్టి, రెండో బడ్జెట్‌లో అది కూడా ప్రకటించలేదని వివరించారు.
 
జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి కేవలం 100 కోట్లు మాత్రమే కేటాయించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాలనన్నింటినీ ఢిల్లీ దృష్టికి తీసుకెళితే బాగుంటుందని పవన్‌తో అన్నారు. దీనికి పవన్‌ సానుకూలంగా స్పందించారు. తప్పనిసరిగా ఈ విషయాలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాల్సిందేనని, తాను కొద్దిరోజుల్లో ఇదే అంశంపై ప్రధానిని కలుస్తానని పవన్‌ చెప్పారు.