శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 25 నవంబరు 2020 (15:43 IST)

తిరుపతి సీటు కోసం జనసేన చీఫ్ పవన్ పట్టు, సాధిస్తారా?

జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపినే పోటీ చేసేందుకు అవకాశమిచ్చారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. స్వయంగా పవన్ కళ్యాణే ఈ విషయాన్ని ప్రకటించారు. తెలంగాణాలోని బిజెపి నాయకులందరూ పవన్ కళ్యాణ్‌ను కలవడం.. జిహెచ్ఎంసిలో బిజెపి అభ్యర్థులు నిలబడతారని.. వారికే అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో ఒప్పుకున్నారు పవన్ కళ్యాణ్.
 
కానీ తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి మాత్రం ఎలాంటి సంప్రదింపులు లేకుండా బిజెపి నాయకులు వారికి వారే నిర్ణయం తీసేసుకున్నారు. ఎన్నికలకు సంబంధించి ముందుగానే ప్రణాళికలు రూపొందించుకుని తెగ హడావిడి చేసేస్తున్నారు. ప్రెస్ మీట్లు, సభలు పెట్టేస్తూ హడావిడి సృష్టిస్తున్నారు. 
 
ఇది ఏమాత్రం పవన్ కళ్యాణ్‌కు ఇష్టం లేదు. తిరుపతి ఎన్నికకు సంబంధించి తనతో మాట్లాడకుండా ఎపి బిజెపి నేతలు తీసుకున్న నిర్ణయం పవన్‌కు కోపం తెప్పించింది. అందుకే నేరుగా ఢిల్లీ వెళ్ళి బిజెపి జాతీయ అధ్యక్షుడిని కలిశారు పవన్ కళ్యాణ్. తిరుపతి సీటు జనసేనకే ఇవ్వాలన్న డిమాండ్‌ను ఆయన ముందుంచనున్నారు పవన్ కళ్యాణ్.
 
లేకుంటే బిజెపితో రాంరాం చెప్పేందుకు సిద్ధమవుతున్నారట. అందుకే నాదెండ్ల మనోహర్‌ను కూడా వెంట పెట్టుకుని వెళ్ళినట్లు తెలుస్తోంది. బిజెపి నాయకులు మాత్రం జనసేనతో కలిసి పోటీ చేస్తామని.. ఉమ్మడి అభ్యర్థి ఉంటారంటూ చెబుతున్నారు. కానీ తిరుపతిలో ఎంపి సీటును గెలిస్తే పార్లమెంటులో జనసేన పార్టీ ఉంటుందని పవన్ భావిస్తున్నారట. మరి దక్షిణాదిలో పాగా వేయాలని చూస్తూ తిరుపతి ఎంపి ఎన్నికల్లో గెలవాలన్న ప్రయత్నిస్తున్న బిజెపి నేతలు అందుకు ఒప్పుకుంటారో లేదో అన్నది ఆసక్తికరంగా మారుతోంది.