1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By కుమార్
Last Updated : శుక్రవారం, 24 మే 2019 (17:42 IST)

టీడీపీ ఓటమికి ముఖ్యకారణం.. జనసేనేనా?

ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ముఖ్య కారణం టీడీపీ ఓటు బ్యాంకును జనసేన కొల్లగొట్టడమే. ముఖ్యంగా 8 లోక్ సభ, 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఈ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించినా వారికి వఛ్చిన మెజారిటీ కన్నా కొన్ని చోట్ల జనసేన అభ్యర్థులకు వఛ్చిన ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. 
 
మొత్తం 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన సాధించిన ఓట్లు టీడీపీ విజయావకాశాలను దెబ్బ తీశాయి. ఇక లోక్ సభ ఎన్నికలకు సంబంధించి వైసీపీ 50 శాతం ఓట్లను సాధించింది. టీడీపీ కన్నా ఇది 10 శాతం ఎక్కువ. తెలుగుదేశం పార్టీకి 39. 18 శాతం ఓట్లు లభించాయి. జనసేన 6.8 శాతం, దాని మిత్ర పక్షాలైన బీఎస్పీ, సీపీఐ, సీపీఎం చెరి ఒక్క శాతం ఓట్లు దక్కించుకున్నాయి. 
 
ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించింది. టీడీపీ-వైసీపీ మధ్య మూడో ముఖ్య పార్టీగా కీలక పాత్ర పోషించగలదనుకున్న జనసేన ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. గాజువాకలో మూడో స్థానంలోనూ, భీమవరంలో రెండో స్థానంలోనూ పవన్ వచ్చారు. విశాఖలో జనసేన తరఫున పోటీ చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా మూడో స్థానానికి దిగజారారు. 
 
తెలుగుదేశం పార్టీతో జనసేన అవగాహన కుదుర్చుకుందని కొందరు రాజకీయ ప్రత్యర్థులు చేసిన ప్రచార ఫలితమే ఇదై ఉండవచ్ఛునని జనసేన నేతలు కొందరు అభిప్రాయపడ్డారు. లేదా టీడీపీలోని ‘ బీ-టీమ్ ‘ శ్రేణుల వ్యూహం కూడా ఇదే అయిఉంటుందని వారు పేర్కొన్నారు. 
 
ఇదే జనసేన విజయావకాశాలను దెబ్బ తీసినట్టు వారు భావిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు వైసీపీకి పడిఉండవచ్ఛు అంటున్నారు. కాపు సామాజిక వర్గంపై జనసేన కొండంత ఆశలు పెట్టుకున్నా.. ఆ వర్గం పవన్ వైపు లేదని తెలుస్తోంది.