1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

భారత న్యాయవ్యవస్థకు స్వచ్ఛమైన దర్పణం : పవన్ కళ్యాణ్

దశాబ్దాల తరబడి అటు ప్రభుత్వాలకు, ఇటు న్యాయవ్యవస్థకు చిక్కుముడిలా నిలిచిన రామజన్మభూమి అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు శనివారం తుది తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై సినీ, రాజకీయ ప్రముఖులు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. సాంత్వన కలిగించేలా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు భారత న్యాయవ్యవస్థ స్వచ్ఛమైన విజ్ఞతకు దర్పణం పడుతోందని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. 
 
ధర్మాన్ని పరిరక్షించేలా తీర్పు ఇచ్చినందుకు సుప్రీంకోర్టుకు భారతీయులుగా తామందరం హృదయపూర్వక సమ్మతి తెలుపుతున్నామని పేర్కొన్నారు. చివరగా 'భారత్ మాతాకీ జై' నినాదంతో ట్వీట్ ముగించారు. 
 
మరోవైపు, అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల విశ్వహిందూ పరిషత్ హర్షం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా హిందువులు సంబరాలు చేసుకోవాల్సిన సందర్భమని వ్యాఖ్యానించింది. వీహెచ్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు. 
 
'ఇది సంతోషకరమైన రోజు, 491 సంవత్సరాలు  పోరాటం, యుద్ధాలు, త్యాగాల అనంతరం దక్కిన విజయం ఇది' అని వ్యాఖ్యానించారు. సత్యం, న్యాయం పక్షాన కోర్టు నిలిచిందన్నారు. 40 రోజులు, 200 గంటలపాటు సుప్రీంకోర్టు విచారణ కొనసాగించి ఇచ్చిన తీర్పు ప్రపంచ న్యాయస్థానాల తీర్పుల్లోనే గొప్పదన్నారు. 
 
ఈ రోజు హిందువులు పండగ చేసుకోవాల్సిన సందర్భమన్నారు. ఇక్కడ ఒకరు గెలిచి, ఒకరు ఓడలేదన్నారు. సంబరాలు ఉద్రిక్తతలకు తావివ్వరాదని చెప్పారు. త్వరతగతిన కేంద్రం తదుపరి చర్యలు తీసుకోవాలని కోరారు.