శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 5 మార్చి 2015 (14:05 IST)

తుళ్లూరులో తెదేపా, భాజపాలపై తూటాల్లాంటి మాటలతో పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతాల సందర్శనలో తెదేపా, భాజపాలపై పదునైన పదజాలంతో చురకత్తుల్లాంటి వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడం పూర్తిగా ప్రజాప్రతినిధుల వైఫల్యమని ఎండగట్టారు. ఎన్నాళ్లు దేహీ దేహీ అని అడుక్కుందాం... సాధించుకోవడం తెలీదా అని ప్రశ్నించారు. ఆనాడు ప్రత్యేక హోదాపై మాట ఇచ్చారు. పూట గడుస్తుంది కానీ మాట మిగిలిపోతోంది. ఇచ్చిన మాట నెరవేర్చేందుకు ప్రభుత్వాలు వెనుకడుగు వేస్తే ప్రజలు సాధించుకోక తప్పదన్నారు. 
 
ఆనాడు పార్లమెంటు తలుపులు వేసి ఆంధ్రా ఎంపీలను తన్ని తగలేసి యూ సీమాంధ్రా గెటవుట్ అనేశారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి అవతల పారేశారు. ఇంకోవైపు తెలంగాణలో కేసీఆర్... ఆంధ్ర కొడకా, ఆంధ్ర కొడకా అంటూ సూదంటు మాటలతో బాధ పెట్టారు. ఆ బాధను ఇంకా ఆంధ్ర ప్రజలు మర్చిపోలేదు. మళ్లీ రాజధాని నిర్మాణం పేరుతో ఇక్కడి రైతుల భూములను బలవంతంగా లాక్కుని కొత్త బాధను ఇక్కడి ప్రజలకు తేవద్దు అంటూ పవన్ విజ్ఞప్తి చేశారు. రైతులను ఒప్పించి తీసుకోవాలి కానీ భూ సమీకరణ చట్టం తెచ్చి బలవంతంగా లాక్కోవద్దు... అలా చేస్తే తను రైతుల తరపున నిలబడి పోరాడేందుకు వెనుకాడనని హెచ్చరించారు.
 
ప్రత్యేక హోదాపై పవన్ చెపుతూ... ఢిల్లీలో ఏదో చేసేసినట్లు డ్రామాలు చేయడం తనకు తెలుసుననీ, పైగా తను నటుడిని కనుక ఇంకా బాగా చేయగలనన్నారు. ఐతే ఇలాంటి డ్రామాలతో పనిలేకుండా ఇక్కడి ఎంపీ సభ్యులు ప్రత్యేక హోదా కోసం గట్టిగా ప్రయత్నించాలి కోరారు.