ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 డిశెంబరు 2019 (16:03 IST)

శబరిమలకు ఎందుకు వెళ్లకూడదంటే.. భార్యకు వివరించిన పవన్ కళ్యాణ్

జనసేన ఆత్మీయ పర్యటన పేరుతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే కడపలో పర్యటించిన ఆయన ప్రస్తుతం చిత్తూరు జిల్లా తిరుపతిలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన తన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
 
తాను ప్రసంగిస్తున్న సమయంలో శబరిమలలో మహిళల ప్రవేశం అంశం ప్రస్తావనకు వచ్చింది. అపుడు పవన్ మాట్లాడుతూ, ఒక్కో మతానికి ఒక్కో ధర్మం ఉంటుందని, దాన్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనన్నారు. 
 
అంతేకాకుండా, శబరిమల గురించి తన భార్య అన్నా లెజినోవో తనను అడిగిందని గుర్తు చేసుకున్నారు. శబరిమలకు తానెందుకు వెళ్లరాదని ఆమె తనను ప్రశ్నించదని చెప్పారు. దీనికి సమాధానం చెబుతూ, "నువ్వు చర్చికి వెళ్లినప్పుడు తలపై చీర కొంగును ఎందుకు కప్పుకున్నావు?" అని అడిగానని, దానికామె, అది తమ సంప్రదాయమని చెప్పిందని అన్నారు.
 
అదేవిధంగా ఒక్కో ధర్మానికి ఒక్కో ఆచారం ఉంటుందని తాను చెప్పానని, అయ్యప్పస్వామి బ్రహ్మచారని, అనునిత్యమూ తపస్సులో ఉంటారు కాబట్టే, మహిళలను ఆయన చూడరని, అందువల్లే మహిళలకు అక్కడ ప్రవేశం లేదని వివరించానని పవన్ తన కార్యకర్తలకు తెలిపారు. రెచ్చగొట్టాలని చూస్తున్న కొందరు మాత్రమే శబరిమలపై కోర్టును ఆశ్రయించారని, ఆలయ వివాదంపై తన తల్లి కూడా బాధపడిందని అన్నారు.