శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (14:36 IST)

పవన్ కళ్యాణ్ వల్ల మాకు ఒరిగింది శూన్యమే : పయ్యావుల కేశవ్

గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వల్ల తెలుగుదేశం పార్టీకి ఒరిగింది శూన్యమేనని టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ అన్నారు. పవన్ కల్యాణ్ వల్ల టీడీపీకి ఓట్లేమీ పెరగలేదని వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఎన్నికలకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీ ఎలాంటి పొత్తు లేకుండానే మెజారిటీ స్థానాలు దక్కించుకుందని గుర్తు చేశారు. 
 
నిజానికి రాష్ట్ర విభజనకు ముందు టీడీపీ పని అయిపోయిందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంతో టీడీపీకి రాజకీయ పునరుజ్జీవం కలిగింది. అప్పటివరకూ జగన్ వైపు మొగ్గున్నా... రాష్ట్రం విడిపోవడంతో.. జగన్ వంటి కుర్రాడి కంటే.. చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడికే అవకాశం ఇవ్వాలని ఆంధ్రా ఓటర్లు ఓ నిర్ణయానికి వచ్చారు. అదేసమయంలో ఈ ఎన్నికలకు ముందు జనసేన పార్టీని పెట్టిన పవన్ కళ్యాణ్.. ఎన్నికల్లో పోటీ చేయకుండా, టీడీపీ - బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు. ఇది టీడీపీ వేయి ఏనుగుల బలం వచ్చేలా చేసింది. 
 
ప్రస్తుతం ఇదే అంశం ఏపీ శాసనమండలిలో చర్చకు వచ్చింది. పవన్ కల్యాణ్ కాళ్లు, మోడీ గడ్డం పట్టుకునే టీడీపీ అధికారంలోకి వచ్చిందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత సి.రామచంద్రయ్య  హాట్ కామెంట్లు చేశారు. కరవు అంశంపై మండలిలో చర్చ జరుగుతున్న సమయంలో రామచంద్రయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగాన్ని పదే పదే అడ్డుకుంటున్న టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఆర్ ఇలా తన ఆవేశం తీర్చుకున్నారు. 
 
సీఆర్ కామెంట్లతో ఒక్కసారిగా టీడీపీ డిఫెన్సులో పడిపోయింది. దీన్ని గమనించిన పయ్యావుల కేశవ్.. పవన్ కల్యాణ్ వల్ల టీడీపీకి ఓట్లేమీ పెరగలేదని వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఎన్నికలకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీ ఎలాంటి పొత్తు లేకుండానే మెజారిటీ స్థానాలు దక్కించుకుందని గుర్తుచేశారు. అయితే ఇప్పటికే రాజధాని భూముల విషయంలో టీడీపీకి - పవన్‌కు గ్యాప్ పెరిగిన నేపథ్యంలో పయ్యావుల కామెంట్లు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో మరి.