19న ఛలో తాడేపల్లి - రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు అరెస్టులు  
                                       
                  
				  				  
				   
                  				  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్పై నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలు, నిరసనలకు దిగుతున్నారు. ఈ జాబ్ క్యాలెండర్ను సవరించాలని కోరుతూ రాష్ట్ర విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు కొన్నిరోజులుగా ఆందోళనలు చేస్తున్నాయి. 
				  											
																													
									  
	 
	ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీ సోమవారం 'ఛలో తాడేపల్లి' కార్యాచరణకు పిలుపునిచ్చాయి. అయితే సీఎం జగన్ నివాసం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, 'ఛలో తాడేపల్లి'కి అనుమతిలేదని గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ స్పష్టం చేశారు. 
				  
	 
	విద్యార్థులు తమ భవిష్యత్తు చూసుకుంటే బాగుంటుందని ఆయన కాస్తంత హెచ్చరిక ధోరణిలో వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పోలీసులు ముందస్తు అరెస్టులకు తెరదీశారు. మరోవైపు, ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి వెళతారన్న సమాచారం నేపథ్యంలో ఎక్కడికక్కడ ముందుగానే అడ్డుకుంటున్నారు. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	తాజాగా, అనంతపురంలో టీడీపీ యువనేత జేసీ పవన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందంటూ పవన్ రెడ్డి టీడీపీ కార్యకర్తలతో తన నివాసంలో ఇవాళ నిరసనలు చేపట్టారు. 
				  																		
											
									  
	 
	ఈ నిరసనలను అడ్డుకున్న పోలీసులు పవన్ రెడ్డిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే, రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ముందస్తు అరెస్టుల పరంపర కొనసాగుతోంది.