1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 29 మే 2019 (15:37 IST)

టెన్త్ క్లాస్‌లో 32 మార్కులతో పాసైంది ఎవరు? రాంగోపాల్ వర్మ ప్రశ్న

జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు టార్గెట్ చేశారు. టెన్త్ క్లాస్‌లో 32 మార్కులతో పాసైంది ఎవరు అంటూ ప్రశ్నించారు. 
 
ఇటీవల వెల్లడైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోగా, పార్టీ అధ్యక్షుడుగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో చిత్తుగా ఓడిపోయాడు. దీనిపై ఆర్జీవీ తాజాగా మరోమారు ట్వీట్ చేశారు. జగన్ నువ్వెలా సీఎం అవుతావో చూస్తానని, తెలంగాణాలో ఆంధ్రులను కొడుతున్నారు అని చెప్పింది ఎవరో అంటూ ప్రశ్నించారు. 
 
ముఖ్యంగా, "ఎన్నికల ప్రచారంలో జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి పవన్ చేసిన ప్రసంగాల క్లిప్పింగులన్నింటిని ఒకచోట చేర్చి ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేశారు. జగన్ అసెంబ్లీకి రాకుండా పారిపోయాడు, రాయలసీమ రౌడీలను గోదాట్లో కలిపేస్తాను, జగన్ చిన్న కోడికత్తికే గింజుకున్నాడు, పాకిస్థాన్‌తో యుద్ధం వస్తుందని నాకు ముందే తెలుసు, నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే ఆపేదెవడు, థియేటర్‌లో జాతీయగీతం పాడితేనే దేశభక్తి ఉన్నట్టా" అంటూ గతంలో జగన్‌ను ఉద్దేశించిన పవన్ వ్యాఖ్యలు చేశారు. 
 
వీటన్నింటిని ఒక చోట చేర్చి.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరు? ఈ మాటలన్నీ ఎవరు చెప్పారు? నేను ఊరకే అడుగుతున్నా అంటూ వర్మ ట్వీట్ చేశారు. కాగా, వర్మ తీసిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎపుడో విడుదల కాగా, తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకోవడంతో ఈ చిత్రం ఏపీలో విడుదల కాలేదు.