శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2017 (14:28 IST)

జగన్‌తో లగడపాటి ఏకాంత భేటీ... వైకాపాలో చేరేనా?

రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియనివారుండరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోతే క్రియ

రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియనివారుండరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోతే క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించి, రాష్ట్ర విభజన తర్వాత ఆ మాటకు కట్టుబడి రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేత. 
 
ఈయన ఇటీవల మళ్లీ లైమ్‌లైట్‌లోకి వస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తరచూ భేటీ అవుతున్నారు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఈ వార్తలను ఆయన స్వయంగా ఖండించారు. 
 
ఈ నేపథ్యంలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డితో లగడపాటి 20 నిమిషాల పాటు ఏకాంతంగా భేటీ కావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. గురువారం తన కుమారుడి వివాహానికి జగన్‌ను ఆహ్వానించేందుకు హైదరాబాద్ వచ్చిన లగడపాటి రాజగోపాల్ ఏకాంతంగా మాట్లాడినట్టు సమచారం. తాను చేపట్టిన పాదయాత్ర, పార్టీ వ్యవహారాల గురించి జగన్ వివరించగా, ఆసక్తిగా విన్న లగడపాటి, కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. 
 
ఈ సందర్భంగా ఏపీలో రాజకీయాల గురించి వీరి మధ్య చర్చ సాగినట్టు సమాచారం. అయితే, లగడపాటి కుమారుడి వివాహం జరిగే 25వ తేదీన తాను పాదయాత్రలో ఉంటాను కాబట్టి పెళ్లికి రాలేనని, అన్యధా భావించవద్దని, తన తరపున వేరెవరినైనా ఖచ్చితంగా పంపుతానని జగన్ చెప్పినట్టు సమాచారం