1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2019 (17:48 IST)

జగన్ 100 రోజుల పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ

ముఖ్యమంత్రిగా వై యస్ జగన్ 100 రోజుల ప్రజా పరిపాలనపై రేపటి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు వైసీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు లేళ్ళ అప్పిరెడ్డి తెలిపారు. దేశంలోనే ఇదో సరికొత్త ప్రయోగమని ఆయన తెలిపారు.

కనీసం ఏడాదో... రెండేళ్ళో కూడా ఆగకుండా కేవలం వంద రోజులపైనే తాము రెఫరండం కోరుతున్నట్లు చెప్పారు. అలాగని దీనికి తామేమీ రాజకీయ రంగు పులమడం లేదని తెలిపారు. పార్టీ రహితంగా... స్వచ్చందంగా... ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈమేరకు గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ప్రజాభిప్రాయ సేకరణ పోస్టర్లను వైసీపీ నేతలు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో బ్రహ్మాండమైన పరిపాలన జరుగుతుందన్నారు.  ఈ పరిపాలనపై ఎవర్నడిగినా... సంపూర్ణంగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అందుకే మా నేత మాట తప్పని - మడమ తిప్పని జగన్ ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పుకునేందుకు తాము గర్వపడుతున్నట్లు వెల్లడించారు.

అయినా కూడా తాము మరింత మెరుగైన పాలన కాంక్షిస్తూ... ప్రజాభిప్రాయ సేకరణకు సిద్దపడినట్లు చెప్పారు. బాగుంది... చాలా బాగుంది... బాగాలేదు... మెరుగైన పరిపాలన కోసం మీరు ఇచ్చే సూచనలు అనే నాలుగు అంశాలపై ప్రజల నుంచి నేరుగా  అభిప్రాయాలను సేకరిస్తున్నామని తెలిపారు. ముందుగా ఆదివారం బృందావన్ గార్డెన్స్ సెంటర్‌లోని ఎన్టీఆర్ స్టేడియం ఎదుట దీనికి శ్రీకారం చుడుతునట్లు వెల్లడించారు.

సోమవారం జడ్పీ కాంపౌండ్లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇలా నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన వివరించారు. పార్టీలకు అతీతంగా ప్రజలు నిష్పక్షపాతంగా స్పందించి స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించాలని ఆయన కోరారు. మెరుగైన పాలనకు మంచి సూచనలు ఇచ్చే ముగ్గురుని ఎంపిక చేసి సత్కరిస్తామని అప్పిరెడ్డి ప్రకటించారు.
 
ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందే రీతిలో సుపరిపాలన సాగుతున్నట్లు చెప్పారు. పాదయాత్ర హామీలు, ఎన్నికల మేనిఫెస్టో అమలు చేసే విధంగా సీఎం ముందుకు సాగుతున్నారని తెలిపారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

ఆదివారం ఎన్టీఆర్ స్టేడియం ఎదుట ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం పట్ల సానుకూలంగా స్పందించి - విలువైన అభిప్రాయం చెప్పాలని ముస్తఫా విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి మహ్మద్ జానీ మాట్లాడుతూ, జగన్ పరిపాలన జనరంజకంగా జరుగుతుందని కితాబిచ్చారు.

వంద రోజుల్లోనే జగన్ ఎన్నో విలువైన కార్యక్రమాలు చేపట్టి.- దివంగత వైఎస్సార్‌ను అధిగమించారని తెలిపారు. పార్టీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పధకాలు అందిస్తున్న ఘపత జగన్‌కే దక్కుతుందని పేర్కొన్నారు ఆయన ఇంకా మరిన్ని పధకాలతో ప్రజా సంక్షేమాన్ని మరింత కాంక్షించాలన్న అభిలాషను వ్యక్తం చేశారు.
 
ఈ కార్యక్రమంలో కావటి మనోహర్‌నాయుడు, ఆతుకూరి ఆంజనేయులు,  ఈచంపాటి వెంకటకృష్ణ(ఆచారి), పోలూరి వెంకటరెడ్డి, అత్తోట జోసఫ్, బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, నూనె ఉమామహేశ్వర రెడ్డి, చిన్నపరెడ్డి, మెట్టు వెంకటప్పారెడ్డి, పానుగంటి చైతన్య, అడకా వేణు తదితరులు ఉన్నారు.