శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

అక్రమ కట్టడాలు తొలగించి అభివృద్ధికి సహకరించండి: ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష

రాష్ట్రంలోనే  ఆదర్శ నగరంగా కడప పట్టణాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్బాష పేర్కొన్నారు. 39వ డివిజన్ మోచంపేటలో ఉపముఖ్యమంత్రి వర్యులు ఎస్ బి. అంజాద్బాష మాజీ మేయర్ సురేష్ బాబుతో కలిసి సిమెంటు రోడ్డు, సిసి డ్రైన్ ల నిర్మాణానికి భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నగరంలో అక్రమ కట్టడాలు నిర్మించిన వారు వెంటనే తొలగించి అభివృద్ధికి సహకరించాలన్నారు. గతంలో నగరపాలక సంస్థ ప్లాన్ లేకుండా అనేక నిర్మాణాలు చేపట్టడం జరిగిందని ఇక ప్లాన్ లేకుండా ఇల్లు నిర్మిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొంతమంది డ్రైనేజీ కాలువలు, కల్వర్టులు ఆక్రమించుకోవడం వల్ల ఇళ్లలోకి డ్రైనేజీ నీరు చేరుతుందన్నారు.

కడప పట్టణాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు 43 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా నేడు 39 వ డివిజన్లో 14వ ఫైనాన్స్ నిధులు 36 లక్షలతో సిసి రోడ్డు, సి సి డ్రైన్ల నిర్మాణాలకు భూమిపూజ చేయడం జరిగిందన్నారు. గత పది సంవత్సరాలుగా అభివృద్ధిలో నిర్లక్ష్యానికి గురైన కడప పట్టణం నేడు ఆదర్శ నగరంగా అభివృద్ధి చేసుకునే సమయం ఆసన్నమైందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి మన జిల్లావాసి కావడం మన అందరి అదృష్టమన్నారు. నగర అభివృద్ధికి ఆయన ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రజలందరూ సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలన్నారు. నగరపాలక సంస్థలో విలీనమైన ప్రాంతాలన్నీ అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.

పట్టణంలో ముఖ్యంగా 16 రోడ్లు వెడల్పు చేయడం జరుగుతుందని రోడ్లు వెడల్పు చేయడం వల్ల ప్రజల ప్రాపర్టీ కూడా పెరుగుతుందన్నారు. నగరంలోని 50 డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులు అభివృద్ది అక్రమాల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని నగరాభివృద్ధికి ఇది ఒక మంచి సువర్ణవకాశమన్నారు. 

పాతకడప చెరువును హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రివర్యులు 55 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని టెండర్లు పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. ఇక్కడ పచ్చదనాన్ని పెంపొందించి నగర ప్రజలు ఆహ్లాదకర వాతావరణంలో స్వేద తీర్చుకునే  విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.

జిల్లాకు ఎనలేని సేవలు చేసిన మహనీయుల విగ్రహాలు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మనది సీఎం జిల్లా ఈ ప్రాంతాన్ని రాష్ట్రస్థాయిలోనే ఆదర్శ నగరంగా అభివృద్ధి చేసుకునేందుకు ప్రజలందరూ కుల, మత పార్టీలకతీతంగా అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలన్నారు.