శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 2 జూన్ 2017 (21:25 IST)

అవినీతిపై ధైర్యంగా ఫిర్యాదు చేయండి... వివరాలు గోప్యంగా ఉంచుతాం : ప్రభుత్వ సలహాదారు పరకాల

ప్రభుత్వం నుంచి అందుతున్న సేవలపై ఫిర్యాదులుంటే.. కాల్ సెంటర్ (1100)కు ధైర్యంగా ఫిర్యాదు చేయొచ్చని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ సూచించారు. కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేసే వారి వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతారని.. ఈ విషయంలో ఎలాంటి సందేహం పెట్ట

ప్రభుత్వం నుంచి అందుతున్న సేవలపై ఫిర్యాదులుంటే.. కాల్ సెంటర్ (1100)కు ధైర్యంగా ఫిర్యాదు చేయొచ్చని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ సూచించారు. కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేసే వారి వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతారని.. ఈ విషయంలో ఎలాంటి సందేహం పెట్టుకోకుండా.. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, మధ్యవర్తుల అవినీతిపై కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి.. వివరాలు చెప్పొచ్చన్నారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలే ముందు అన్న నినాదంతో.. ప్రభుత్వం అందిస్తున్న సేవలు, వాటిపై ప్రజల్లో సంతృప్తి స్థాయిలపై సమీక్ష జరుపుకోవాలనుకోవడం గొప్ప ముందడుగుగా ఆయన పేర్కొన్నారు. 
 
ఇందుకోసం ఐదొందల మంది ఉద్యోగులతో ఏర్పాటు చేసిన (1100) కాల్ సెంటర్ కు అద్భుతమైన స్పందన వస్తోందని తెలిపారు. పెన్షన్లు, చంద్రన్న బీమా, రేషన్ కార్డుల జారీ వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో సేవలు ఎలా అందుతున్నాయన్న అంశంపై కాల్ సెంటర్ నుంచి ఫోన్ చేసి వాకబు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు చంద్రన్న బీమాకు సంబంధించి 52 వేల మందికి, పెన్షన్లకు సంబంధించి ఆరు లక్షల 40 వేల మందికి, రేషన్ కార్డుల గురించి తొమ్మిది లక్షల 50 వేల మందికి ఫోన్ చేసి.. ప్రభుత్వ అధికారుల పనితీరును వాకబు చేసినట్టు చెప్పారు. 
 
వీరిలో మూడు వేల మంది అధికారుల అవినీతి గురించి చెప్పారని.. వారిచ్చిన వివరాల ఆధారంగా విచారించి.. వివరాలు సరిపోల్చుకుంటున్నట్టు తెలిపారు. వీరిలో కొందరు అధికారులు ఇప్పటికే ప్రజల నుంచి తీసుకున్న లంచం సొమ్మును వెనక్కి ఇచ్చేశారని.. ప్రభుత్వంలో అవినీతిని తగ్గించడం కోసం చేపట్టిన ఈ ప్రయోగం.. మున్ముందు మరిన్ని ప్రయోజనాత్మక ఫలితాలివ్వబోతుందని భావిస్తున్నామన్నారు. ప్రభావవంతమైన ఈ అస్త్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పరకాల ప్రభాకర్ కోరుతున్నారు. ఫిర్యాదులు చేసేటప్పుడు ఆధారాలు చూపించగలిగితే.. తీసుకునే చర్యలు గణనీయమైన ఫలితాలనిస్తాయని సూచించారు. 
 
ఫిర్యాదులు చేసే వారి వివరాలను కూడా అత్యంత గోప్యంగా ఉంచుతామని.. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోనవసరం లేదని, ఫిర్యాదిదారుల రక్షణకు ప్రభుత్వం హామీగా ఉంటుందని తెలిపారు. లంచగొండులను బయటపెట్టేవారి రక్షణ కోసం ఇప్పటికే పటిష్టమైన చట్టాలున్నాయని.. అవసరమైతే.. కేంద్ర చట్టాలను కూడా పరిశీలించి.. మరిన్ని రక్షణాత్మక చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమాజంలో విస్తృతంగా పాతుకుపోయిన లంచగొండితనం, అవినీతిన ప్రక్షాళన చేయడానికి చేపట్టిన ఈ ప్రయోగం అద్భుత ఫలితాలనిస్తోందన్నారు. ప్రభుత్వంలోని అన్ని పథకాలకు సంబంధించిన ఎవరు, ఎక్కడ అవినీతికి పాల్పడుతున్నా.. ప్రజలు కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేయొచ్చని ఆయన సూచిస్తున్నారు. 
 
నవనిర్మాణ దీక్ష వేదికపై విమర్శలా ? :
నవ నిర్మాణ దీక్షను విజయవాడ బెంజ్ సర్కిల్ లో నిర్వహించడంపై ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా రాని పార్టీలు విమర్శించడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై ఒక గంటసేపు మాట్లాడి.. ప్రజల్లో స్ఫూర్తి నింపడం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తప్పు పట్టడం సరికాదన్నారు. రాష్ట్రం వీధిన పడిన రోజు, చారిత్రక నేపధ్యం ఉన్న రోజును తలుచుకుని.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోడానికి ఏం చేస్తున్నాం.. ఇంకా ఏం చేయాల్సి ఉంది.. అన్న అంశాలను చర్చించుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుపట్టడం అసంబద్ధమన్నారు. 
 
సమైక్య రాష్ట్రం కోసం ఇదే బెంజ్ సర్కిల్ వద్ద నిలబడి.. రోజుల తరబడి ఉద్యమాలు చేసిన విషయం కాంగ్రెస్ నాయకుడు రఘువీరారెడ్డికి గుర్తు లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధికి ఏం చేయాలన్న అంశంపై ప్రజల్లో చైతన్యం తెచ్చి.. ప్రభుత్వానికి చేతనైనంత సాయం చేయాల్సిన కాంగ్రెస్ నాయకులు.. వేదికపై బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.