కేసీఆరూ... ఆ విషయం తేలితే.. నాపై కేసులు పెట్టుకో: రేవంత్ సవాల్
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును వదులుకుంటున్నట్లు ఎల్ అండ్ టీ సంస్థ ప్రకటించడం, ప్రభుత్వంతో చర్చల తర్వాత తిరిగి పనులు కొనసాగిస్తామని చెప్పిన తరుణంలో తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలితే, తనపై కేసులు పెట్టుకోవచ్చని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి కేసీఆర్కు సవాలు విసిరారు.
గచ్చిబౌలిలో ఎల్ అండ్ టీకి కేటాయించిన 32 ఎకరాల భూమిని ఒకరికి ప్రభుత్వం బదిలీ చేసిందన్న తన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ భూముల బదలాయింపు వల్లనే ఎల్ అండ్ టీ, ప్రభుత్వం మధ్య విభేదాలు పొడచూపాయని కూడా రేవంత్ చెప్పారు. కేవలం ఓ వ్యక్తి ప్రయోజనాల కోసం, మెట్రో రైలు ప్రాజెక్టునే వదులుకునేందుకు ప్రభుత్వం సిద్ధపడిందని ధ్వజమెత్తారు.
కేసీఆర్ విశ్రాంతి తీసుకోవడానికి నందగిరి గడిని ఇస్తున్న దొరకి దోచిపెట్టడానికి మెట్రో రైలు ప్రాజెక్టును పణంగా పెడతారా అని రేవంత్ బుధవారం విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు.