శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 27 మే 2019 (19:35 IST)

లడ్డూ అయితే ఇచ్చేశారు కానీ రోజా భయంతో వణికిపోతున్నారట... అందుకే జగన్ చుట్టూ...

అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఐఎఎస్‌లు ఎక్కడెక్కడ ఉండబోతున్నారు. ఏయే శాఖలో ఎవరెవరిని నియమించబోతున్నారన్నదే ఆసక్తికరంగా మారుతోంది. అధికారంలో లేనప్పుడు వైసిపిని ఇబ్బంది పెట్టిన ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లపై జగన్ ఖచ్చితంగా కక్ష తీర్చుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.
 
ఈ నేపధ్యంలో కొంతమంది ఐఎఎస్‌లు జగన్‌ను ప్రసన్నం చేసుకునేందుకు పోటీలు పడుతున్నారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. టిటిడి అంటేనే పెద్ద ధార్మిక సంస్థ. తిరుమల లాంటి ఆధ్యాత్మిక క్షేత్రానికి సంబంధించిన వ్యవహారాలను చూసే టిటిడిలో ఈఓ, జెఈఓ పోస్టులంటే చాలా కీలకమైనవి.
 
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి దగ్గరగా ఉన్న ఐఎఎస్‌లు ఎవరైతే ఉంటారో వారినే ఈఓ, జెఈఓలుగా నియమిస్తూ ఉంటారు. తిరుమల జెఈఓ పోస్ట్ కూడా ఎంతో ముఖ్యమైనది. తిరుమలలో జెఈఓగా ప్రస్తుతం పనిచేస్తున్న శ్రీనివాసరాజు గత యేడేళ్ళుగా అక్కడే పాతుకుని పోయి ఉన్నారు. దీంతో ఆయనతో పాటు ప్రస్తుత ఈఓగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ కూడా గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.
 
అనిల్ కుమార్ సింఘాల్ బిజెపి నాయకుడిగా ముద్ర ఉంది. తిరుమల జెఈఓ శ్రీనివాసరాజుకు టిడిపి నేతల సపోర్ట్ ఉందన్న ప్రచారం ఉంది. ఆమధ్య రోజా తిరుమల వెళ్లినప్పుడు శ్రీనివాసరాజు విఐపి దర్శనాల విషయంలో తేడాగా మాట్లాడారంటూ ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డికి విన్నపాలు కూడా వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.
 
దీంతో వీరిద్దరినీ మార్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరు టిటిడి వేదపండితులను వెంట పెట్టుకుని మరీ అమరావతికి వెళ్ళారు. అమరావతిలో ఉన్న జగన్‌ను వేదపండితులు ఆశీర్వదించారు. స్వామివారి ప్రసాదాలను జగన్ మోహన్ రెడ్డికి అందజేశారు. వీరిద్దరే కాదు ఇంకా చాలామంది ఐఎఎస్‌లు జగన్‌ను కలిసి మేము కూడా ఉన్నామంటూ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.