బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 3 డిశెంబరు 2017 (08:42 IST)

శోభనం రాత్రే భర్త శాడిజం... వధువు ముఖంపై పిడిగుద్దులు

వేదమంత్రాలు, అగ్నిసాక్షిగా పెళ్లిన ఓ భర్త తొలిరాత్రే తనలోని శాడిజాన్ని నూతన వధువుకు చూపించాడు. శోభనం కోసం గదిలోకి కుందనపు బొమ్మలా అడుగుపెట్టిన వధువుకు నరకం చూసింది.

వేదమంత్రాలు, అగ్నిసాక్షిగా పెళ్లిన ఓ భర్త తొలిరాత్రే తనలోని శాడిజాన్ని నూతన వధువుకు చూపించాడు. శోభనం కోసం గదిలోకి కుందనపు బొమ్మలా అడుగుపెట్టిన వధువుకు నరకం చూసింది. పిడిగుద్దులు కురిపించి ఆమెను కురూపిలా మార్చాడు. తీవ్ర సంచలం రేకెత్తించిన ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం చిన్నదామరగుంటలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చిన్నదామరగుంట గ్రామానికి చెందిన మునికృష్ణా రెడ్డి అనే వ్యక్తి కుమార్తె శైలజ(23)కు, అదే మండలం మోతరంగనపల్లెకి చెందిన రాజే‌ష్(27)తో గత శుక్రవారం వివాహమైంది. వరుడు వి.కోట మండలం ఆదినపల్లె ఎంపీపీ పాఠశాలలో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, శైలజ ఎంబీఏ చదువుతోంది. వివాహం ముగిసిన రాత్రే వధువు ఇంట్లో శోభనం ఏర్పాట్లు చేశారు. శైలజను ముస్తాబు చేసి భర్త ఉన్న గదికి పంపించారు. కొంతసమయం తర్వాత గదిలోంచి వధువు కేకలు వినిపించాయి. ఏం జరిగిందో అనే ఆందోళనతో తల్లిదండ్రులు, బంధువులు గది తలుపు తట్టారు.
 
ఎంతకీ తలుపు తీయలేదు. లోపల నుంచి ఏడుపులు వినిపిస్తున్నాయి. ఇక తలుపులు బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యారు. ఈలోగా నెత్తుటి గాయాలతో శైలజే తలుపు తీసుకుని వచ్చి బయట పడింది. ముఖమంతా గాయాలతో కళ్లు వాచిపోయి దారుణంగా తయారైన ఆమెను చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. 
 
ఆగ్రహంతో వరుడు రాజేష్‌పై దాడికి సిద్ధపడ్డారు. వెంటనే అతను లోపలికి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. శైలజను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వధువు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రాజేష్‌‍ను అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలపై విచారిస్తున్నారు.