1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 31 మార్చి 2017 (05:00 IST)

అసెంబ్లీలో పేలిన శాతకర్ణి పంచ్ డైలాగులు. శరణమా.. మరణమా?

పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ విషయం గురువారం ఏపీ అసెంబ్లీని యుద్ధరంగంగా మార్చేసింది. ఈ లీకేజీ వ్యవహారంలో మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన వియ్యంకుడు, నారాయణ విద్యాసంస్థల అధినేత మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణలిద్దరి హస్తం ఉన్నట్

పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ విషయం గురువారం ఏపీ అసెంబ్లీని యుద్ధరంగంగా మార్చేసింది. ఈ లీకేజీ వ్యవహారంలో మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన వియ్యంకుడు, నారాయణ విద్యాసంస్థల అధినేత మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణలిద్దరి హస్తం ఉన్నట్లు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేసిన ఆరోపణలు అసెంబ్లీని రోజుపొడవునా అట్టుడికించాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మధ్య వ్యక్తిగత యుద్ధం జరిగి సభ పలుమార్లు వాయిదా పడటం ఒక ఎత్తైతే ఇరు పక్షాలూ ఇటీవలే విడుదలైన బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలోని పంచ్ డైలాగులను తమ వాదనకు బలం చేకూర్చేలా వాడుకోవడం గమనార్హం. సినిమాలో రౌద్రంగా తాను సంధించిన పంచ్ డైలాగులు సాక్షాత్తూ అసెంబ్లీలో ఒక రేంజిలో పేలడం బాలకృష్ణను పరమానంద భరితుడిని చేసి ఉంటుందనడంలో సందేహమే లేదు.
 
పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకు విషయమై ప్రతిపక్ష నేత జగన్ పక్కాగా సాక్ష్యాధారాలు చూపుతూ లోటుపాట్లను ఎత్తిచూపడం టీడీపీ ప్రభుత్వాన్ని బాగా ఇరుకున పడేసింది. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో మంత్రి నారాయణ పాత్ర బయటపడాలంటే సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని జగన్ డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై చర్చించడం ప్రమాదకరమని గ్రహించిన చంద్రబాబు  వైఎస్‌ జగన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగారు. లీకేజీలపై విచారణలో తప్పులున్నట్లు తేలితే ఎవర్నీ వదిలిపెట్టనని.. తాను చండశాసనుణ్ని అంటూ విచారణకు సహకరిస్తారా లేదా అంటూ ప్రతిపక్ష నేతను ప్రశ్నించారు. ఇదే సమయంలో శాతకర్ణి సినిమాను ఊతంగా తీసుకుని, సమయం లేదు ప్రతిపక్షమా.. మీకున్నది రెండే ఆప్షన్లు.. సహకరిస్తారా పారిపోతారా  అంటూ వ్యంగ్యంగా అన్నారు.
 
దీనికి స్పందించిన జగన్‌ సహనం పాటించి బాబు ఎత్తులను ఎదుర్కొన్నారు.  చిత్తశుద్ధి ఉంటే మంత్రులను బర్త్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ‘మంత్రి నారాయణ పాత్ర బయటపడాలంటే సీబీఐతో విచారణ చేయించాలి. విచారణకు సహకరిస్తాం’ అంటూ సవాల్‌ విసిరారు. జగన్‌కు మద్దతుగా ప్రతిపక్ష సభ్యులు స్పందిస్తూ.. ‘సమయం లేదు మిత్రమా.. శరణమా.. మరణమా..’ అంటూ అధికారపక్షానికి కౌంటర్‌ ఇచ్చారు.
 
చివరికి చర్చ శుక్రవారానికి వాయిదా పడింది కానీ.. లీకేజీ పుణ్యమా అని బాలకృష్ణ డైలాగులను అసెంబ్లీలో ఇరుపక్షాలూ దంచికొట్టాయి.