1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 మే 2021 (20:10 IST)

హైకోర్టుకు చేరిన ఆనందయ్య ఆయుర్వేద మందు పంచాయతి

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం మేజర్ పంచాయతీకి చెందిన బోణిగి ఆనందయ్య పంపిణీ చేసే ఆయుర్వేద మందు పంచాయతీ ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మందులోని లోగుట్టును తేల్చేందుకు ఐసీఎంఆర్‌తో పాటు ఆయుష్ శాఖ రంగంలోకి దిగాయి. అప్పటివరకు మందు పంపిణీని నిలిపివేయాల్సిందిగా ఏపీ సర్కారు ఆదేశించింది. అయితే, ఇపుడు ఈ పంచాయతీ హైకోర్టుకు చేరింది. 
 
ఆనందయ్య నాటు మందుపై ఆంధ్ర‌ప్రదేశ్ హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. పిటిషన్‌ విచార‌ణ‌ అనుమతి కోసం హైకోర్టు న్యాయవాది యలమంజుల బాలాజీ దరఖాస్తు చేశారు. అనంతపురానికి చెందిన మాదినేని ఉమామహేశ్వరనాయుడు తరపున న్యాయ‌వాది ఈ పిటిష‌న్ వేశారు. 
 
ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్నారని, దాన్ని తీసుకుని చాలామంది కోలుకున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. అయితే, ప్ర‌భుత్వం ఆనందయ్య మందు పంపిణీని నిలిపివేయ‌డం వ‌ల్ల‌.. అనేక మంది ఈ మందును తీసుకోలేకపోతున్నారని పిటిషనర్ హైకోర్టుకు విన్న‌వించారు. దీనిపై విచారణకు అనుమతించాలని న్యాయవాది యలమంజుల బాలాజీ హైకోర్టుకు లేఖ రాశారు. దీనిపై హైకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. 
 
మరోవైపు ఆనందయ్య మందు పంపిణీపై స‌స్పెన్స్ కొనసాగుతోంది. ఈ మందులో ఎలాంటి హానికర పదార్థాలు లేవని ఆయుష్ ఏపీ శాఖ కమిషనర్ రాములు నాయక్ వెల్లడించారు. మరోవైపు, ఈ మందుపై శాస్త్రీయ అధ్యయనం చేసి అతి త్వ‌ర‌గా నివేదిక ఇవ్వాల‌ని సీఎం జ‌గ‌న్ ఆయూష్ టీమ్‌ను ఆదేశించారు. అప్ప‌టివ‌ర‌కు మందు పంపిణీని ఆపాల‌ని సూచించారు.