గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 9 ఫిబ్రవరి 2019 (09:16 IST)

రాకేష్‌ను 9 నెలలుగా దూరం పెట్టా.. అందుకే చంపేసివుంటాడు.. శిఖా చౌదరి

పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన మేనకోడలు శిఖా చౌదరి ఓ ఇంటర్వ్యూలో తన మేనమామ మర్డర్‌కు సంబంధించి కీలక విషయాలు తెలిపింది. టెట్రాన్ కంపెనీలో కార్మికులతో సమస్య వచ్చినప్పుడు దానిని పరిష్కరించేందుకు వచ్చాడని, అప్పుడే అతడితో పరిచయం ఏర్పడిందని శిఖా పేర్కొంది. 
 
మామయ్య అతడి దగ్గరే నాలుగు కోట్లు తీసుకున్నారన్న విషయం ఆయన మరణించాకే తనకు తెలిసిందని.. ఆర్థిక ఇబ్బందుల వల్ల డబ్బులు ఇవ్వకపోవడం వల్లే రాకేశ్ ఈ హత్య చేశాడని భావిస్తున్నట్టు శిఖా చౌదరి తెలిపింది. రాకేష్ తరచూ తనకు ఫోన్ చేస్తుండేవాడని.. అతడి ప్రవర్తన నచ్చక 9 నెలల పాటు అతడిని దూరంగా వుంచానని శిఖా చౌదరి చెప్పింది.
 
అంతేగాకుండా కోటి రూపాయలు కావాలంటూ మామయ్య తనకు ఫోన్ చేశారని, జనవరి 29న మామయ్యను కలిశానని తెలిపింది. జనవరి 31వ తేదీన కోటి రూపాయలు రెడీ అయ్యాయా అని అడిగారని.. అప్పుడే నాలుగు కోట్లు అప్పు వుందని చెప్పారని.. ఎవరి దగ్గర తీసుకున్నారనే విషయాన్ని మాత్రం తనకు చెప్పలేదని శిఖా చౌదరి తెలిపింది. కానీ తనకు బాగా తెలిసిన వ్యక్తి వద్ద ఆ మొత్తాన్ని తీసుకున్నట్లు శిఖ వెల్లడించింది. అదే రోజు మామయ్య రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు అమ్మ చెప్పిందని గుర్తు చేసుకుంది. 
 
మామయ్య చనిపోయాక ఆయన ఇంటికి వెళ్లిన మాట వాస్తవమేనని, అయితే అంతకుముందు ఆయన తీసుకెళ్లిన ప్రాజెక్టు ఫైల్ తీసుకొచ్చేందుకే వెళ్లానని, తనతోపాటు ఆ ఇంటి వాచ్‌మెన్ కూడా ఇంట్లోకి వచ్చారని శిఖా వివరించింది. 
 
భూమి పత్రాలు తీసుకునేందుకు వెళ్లాననడం పూర్తిగా అబద్ధమని, హత్యతో తనకు ప్రమేయం ఉంటే అందరికీ తెలిసేలా ఆయన ఇంటికి ఎలా వెళ్తానని శిఖ వెల్లడించింది. మామయ్య హత్యలో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఆయన చనిపోయారన్న షాక్ నుంచి తానింకా తేరుకోలేదని పేర్కొంది. ఈ హత్యలో తనపై ఎందుకు విమర్శలు వస్తున్నాయో అర్థం కావట్లేదని చెప్పుకొచ్చారు.