1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 5 జూన్ 2019 (16:30 IST)

గుడిసెకి ఏసీ.. అత్త కోసం అల్లుడి ఔదార్యం

ఇంటికి ఏసీ పెట్టించుకున్నారు అంటే.. కాస్తో, కూస్తో శ్రీమంతుల కుటుంబమే అనుకోవాలి. పల్లెటూర్లలో అయితే ఏసీ అనేది ఖచ్చితంగా లగ్జరీగా భావించే వ్యవహారమే. మాములుగా అయితే ఖరీదైన బంగళాలు, డాబాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. కానీ పూరింట్లో మీరు ఎప్పుడైనా ఏసీ చూశారా? అయితే పైన ఫోటో చూడండి. 
 
ఇది ఎక్కడో జరిగింది కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాలాజీ నగర్‌లో జరిగింది. కొన్నేళ్లుగా అక్కడే నివసిస్తున్న ఓ వృద్ధురాలు అనారోగ్యంతో మంచాన పడింది. దీంతో ఆమె నివశిస్తున్న గుడిసెకు హైటెక్ హంగులు అద్దాడు వృద్ధురాలి అల్లుడు. కూలర్‌ని ఏర్పాటు చేశాడు. ఒకవేళ ఎండ వేడి పెరిగితే ఆవిడ ఇబ్బంది పడుతుందేమో.. ఏసీ కూడా పెట్టించాడు. దీంతో.. అత్త ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 
 
ప్రస్తుత కాలంలో తల్లీదండ్రులనే పట్టించుకోని వారున్న లోకంలో.. అత్తకి బాగాలేదని ఆమె కోసం సకల సౌకర్యాలు కల్పించి.. గుడిసెకు ఏసీ ఏర్పాటు చేయడాన్ని చూసి కాలనీవాసులు సదరు అల్లుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.