ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు... ఏపీలో కేఈ కృష్ణమూర్తి, టీలో కేసీఆర్..!
రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామ నవమి వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వాడవాడలా రామాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయంలో ప్రభుత్వం అధికారిక వేడుకలకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి హాజరవుతున్నారు.
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో సీతారాముల కల్యాణోత్సవంలో టీఎస్ సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఛైత్రశుధ్ద నవమి అభిజిత్ లగ్నమందు శ్రీరామకల్యాణం నిర్వహించనున్నారు.
ఇదేవిధంగా ఉత్తరాంధ్రలోని రామతీర్థంలో కూడా ఆంధ్రా ప్రభుత్వం అధికారికంగా వేడుక నిర్వహించనుంది. ఒంటిమిట్టలో శ్రీరామునికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పట్టువస్త్రాలు సమర్పించనుండగా, రామతీర్థంలో దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ఇక భద్రాచలంలో రామయ్యకు కేసీఆర్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. కాగా, ఏప్రిల్ 2న జరిగే కల్యాణోత్సవంలో గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు పాల్గోనున్నారు. దేశంలోని ప్రధాన దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీరామకల్యాణాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు దేవాలయాలకు చేరుకుంటున్నారు.