చంద్రబాబువి ఫారిన్ టూర్లు కాదు.. జాలీ ట్రిప్స్ : శ్రీకాంత్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తన వెంట తన అనుచరగణాన్ని వెంటబెట్టుకుని విదేశీ పర్యటనలకు వెళ్లడాన్ని వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు చేపట్టే విదేశీ పర్యటనలు జాలీ ట్రిప్స్తో పోల్చారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజల కష్టాలను మరచిపోయి విదేశాల్లో జాలీ ట్రిప్పులు వేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు కన్నా నీరో చక్రవర్తి నయమన్న చందంగా ఆయన వ్యవహరిస్తున్నారన్నారు.
గతంలో సీఎంగా ఉన్న సమయంలో విదేశీ పర్యటనలు చేసి రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చారని ప్రశ్నించారు. విదేశీ పర్యటనలకు చేసిన ఖర్చుకు సమానంగానైనా విదేశీ పెట్టుబడులు వచ్చాయా? అని అడిగారు.
చంద్రబాబుకు ప్రచారం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు. విదేశీ పర్యటనలకు కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు విదేశీ పర్యటనలపై కేంద్ర నిఘా సంస్థ ద్వారా దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు.