శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (07:33 IST)

తొమ్మిదేళ్ల స్నేహంలో తన నోటి నుంచి ఒక్క చెడుమాటా వినలేదు: కన్నీటిపర్యంతమైన అలోక్

జాతి వివక్షకు బలైన కూచిభొట్ల శ్రీనివాస్‌ సంస్మరణ సభ కన్సాస్ నగరంలో అత్యంత ఉద్వేగంగా సాగింది. కాల్పుల ఘటన సమయంలో శ్రీనివాస్‌తో ఉన్న ఆప్తమిత్రుడు అలోక్ తన మిత్రుడి జ్ఞాపకాలను తల్చుకుంటూ విలపించారు.

జాతి వివక్షకు బలైన కూచిభొట్ల శ్రీనివాస్‌ సంస్మరణ సభ కన్సాస్ నగరంలో అత్యంత ఉద్వేగంగా సాగింది. కాల్పుల ఘటన సమయంలో శ్రీనివాస్‌తో ఉన్న ఆప్తమిత్రుడు అలోక్ తన మిత్రుడి జ్ఞాపకాలను తల్చుకుంటూ విలపించారు. ‘శ్రీనివాస్‌తో నాది తొమ్మిదేళ్ల స్నేహబంధం. ప్రతి ఒక్కరికీ ప్రేమ, అనురాగం, ఆప్యాయత పంచే ఇలాంటి వ్యక్తిని జీవితంలో ఒక్కసారైనా కలవాలి. ఆయన నోటివెంట ఒక్కసారి కూడా చెడు మాట వినబడలేదు. ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకునేతత్వం ఆయనది. ఆరోజు బార్‌లో జరిగిన ఘటన మరెక్కడా పునరావృతం కాకూడదు. శ్రీనివాస్‌ ఇకలేడనే విషయం జీర్ణించుకోలేకపోతున్నా. నాకోసం ఆయనిక్కడుండాల్సింది’ అని అలోక్‌ కన్నీటి పర్యంతమయ్యారు.
 
‘నేను కారు కొనుక్కునేంతవరకు రోజూ ఆఫీసుకు శ్రీనివాస్‌ తన కార్లోనే తీసుకెళ్లేవాడు. ఒక్కరోజు కూడా విసుక్కున్నట్లు కనిపించలేదు. అలాంటి మనుషులను చాలా అరుదుగా చూస్తుంటాం. తొమ్మిదేళ్ల మా స్నేహం తాలూకు జ్ఞాపకాలింకా నా మదిలో మెదులుతున్నాయి’ అని వెల్లడించారు. శ్రీనివాస్‌ మిత్రులు మరికొందరు కూడా అతని మంచితనం, ఇతరులకు సహాయపడే తత్వాన్ని గుర్తుచేసుకుని కంటతడిపెట్టారు. ‘గోఫండ్‌మి’ పేరుతో తెరిచిన మూడు వేర్వేరు అకౌంట్లలో ఇప్పటివరకు దాదాపు మిలియన్ (దాదాపు రూ.6.71 కోట్లు) విరాళాలుగా వచ్చాయి. వీటితో అలోక్, ఇయాన్‌కు వైద్యం చేయించటంతోపాటు శ్రీనివాస్‌ కుటుంబానికి సాయం చేయనున్నారు.