విద్యార్థిని అనుమానస్పద మృతి.. బంధువుల ఆందోళన
ఒంటిపై గాయాలు... ఆమెమో ఊరేసుకుని చనిపోయినట్లు కనిపిస్తోంది. తమ బిడ్డ మృతి చెందడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందారు. హత్య చేశారని తల్లిదండ్రలు ఆరోపిస్తున్నారు. ఏలూరులో ఓ విద్యార్థిని మృతి అనేక రకాల అనుమానాలకు దారి తీసింది. వివరాలిలా ఉన్నాయి.
దెందులూరు మండలం రామారావు గూడెంలో నివాసం ఉండే కస్సే రచన(16) పదవ తరగతి చదువుతోంది.ఈమె తండ్రి కొండలరావు, తల్లి జ్యోతిలు వ్యవసాయ కూలీలు. విద్యార్థిని వారం రోజుల నుంచి వాంతులతో బాధపడుతోందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థిని ప్రాంగణంలోని పాఠశాలలో ఉన్న క్లాస్ రూంలో చున్నీకి వేలాడుతూ కన్పించింది. అయితే ఆమె ఒంటిపై గాయాలున్నాయి. అయితే చనిపోయిన వెంటనే హాస్టల్ సిబ్బంది మృతదేహాన్ని పోస్టుమార్టు నిమిత్తం తరలించారు. అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు.
మృతదేహాన్ని ఇక్కడకు తీసుకురావాల్సిందేనంటూ జాతీయ రహదారిపై ధర్నాకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు గంటలపాటు ఆందోళనకారులు జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో సుమారు ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. అక్కడి నుంచి ఆందోళనకారులు ఆగ్రహంతో హాస్టల్ వద్దకు చేరుకున్నారు. హాస్టల్లో చొరబడి కార్యాలయ ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. అడ్డు వచ్చిన సిబ్బందిపై దాడి చేయడంతో రికార్డు అసిస్టెంట్కు స్వల్ప గాయాలయ్యాయి.
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దుర్ఘటన స్థలానికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కుటుంబ సభ్యులను శాంతింపచేసి వారిందరినీ ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. రచన ఒంటిపై గాయాలున్నాయని, తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంద పిరికిది కాదని, మరో కేసులో సాక్షి అయిన తమ బిడ్డను కొట్టి చంపారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే కలెక్టర్ కాటంనేని భాస్కర్ పరిశీలించారు. సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నంబూరి భారతి విధి నిర్వహణలో అలసత్వం వహించిన కారణంగా ఆమె సస్పెండ్ చేస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు.