1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 జూన్ 2023 (08:27 IST)

వివేకా హత్య కేసులు : అవినాశ్ ముందస్తు బెయిల్ రద్దు చేయండి : సునీత

ys sunitha
తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీత కోరారు. 
 
ఈ మేరకు ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై నేడు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో అవినాశ్ రెడ్డిని కీలకంగా వ్యవహరించారని సీబీఐ పేర్కొన్నందున ఆయనకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
అవినాశ్‌పై సీబీఐ ఇప్పటివరకు దాఖలు చేసిన చార్జిషీట్లు, అఫిడవిట్లు అన్నీ తీవ్రమైనవేని, కానీ, తెలంగాణ హైకోర్టు మాత్రం వాటిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని అభిప్రాయపడ్డారు. జూన్ 30వ తేదీలోగా దర్యాప్తు ముగించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించినందున విచారణ సజావుగా సాగేందుకు అవినాశ్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సునీత తరపు న్యాయవాదులు బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ప్రస్తావించనున్నారు.