బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 5 జూన్ 2020 (21:51 IST)

బాలకృష్ణ మానసిక స్థితిపై అనుమానం, ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించాలి, ఎవరీ సంచలనం?

టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మానసిక పరిస్థితిపై అనుమానాలు ఉన్నాయని, ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించాలని ప్రభుత్వానికి లేఖ రాస్తున్నానని ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. బాలకృష్ణ, చంద్రబాబులపై విమర్శలు గుప్పించారు. 
 
"చంద్రబాబును చూస్తే చచ్చిపోయిన పామును కూడా జాకీలు వేసి లేపాలనే మాదిరిగా ఎల్లోమీడియా ప్రయత్నం చేస్తుంది. ఇటీవల ఓ ఛానల్లో బాలకృష్ణ కామెంట్స్ చూశాను. ఫ్రెంచి రివల్యూషన్ లాంటి సంఘటన ఇక్కడ మళ్లీ జరుగుతుంది. పరిపాలన సరిగా లేదు. కరోనాను కట్టడి చేయలేకపోయారు అని వ్యాఖ్యానించారు. 
 
అయ్యా బాలకృష్ణగారు....వేదికలపై అమ్మాయి కనబడితే ముద్దుపెట్టుకోవాలి... లేదా కడుపుచేయాలి అని మాట్లాడే బాలకృష్ణ.. ఫ్రెండ్షిప్ గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి మాట్లాడటం చూస్తే నవ్వొస్తుంది. 
 
బాలకృష్ణ ఇంట్లో ఓ సంఘటన జరిగింది. బెల్లంకొండ సురేష్ కాల్పుల ఘటనలో నుంచి బయటపడేందుకు డాక్టర్ బాలకృష్ణకు ఓ సర్టిఫికేట్ ఇచ్చారు- ఆయనకు మానసికంగా బాగోలేదు అని. 
 
బాలకృష్ణపైన, ఎన్టీఆర్ కుటుంబంపై మాకు, ప్రజలకు సానుభూతి ఉంటుంది. ఎందుకంటే తన తండ్రి పోరాడి అధికారంలోకి తెచ్చిన పార్టీని లాక్కుని, ఆయనను చెప్పులతో కొట్టించి, ఆయన చావుకు కారకులైన చంద్రబాబును మీరు భుజాన వేసుకోవడం వల్ల మీపై కనికరం పోయి రేపు ఫ్యాన్స్ కు కూడా తీవ్రమైన ఆలోచన కలుగుతోంది. 
 
బాలకృష్ణ వాస్తవాలు తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా మెంటల్‌గా మాట్లాడటం దారుణం. చంద్రబాబును అతని పరిపాలన బాగోలేదని, ఆయన 600 హామిలతో ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయలేదని చెప్పి ప్రజలు తరిమికొట్టారు. 
 
కరోనా సమయంలో చంద్రభవన్లో జూమ్ చూసుకుంటూ కూర్చున్నావు. సాధారణంగా వెన్నుపోటు బాబు అంటారు. ఇప్పుడు జూమ్ జూమ్ బాబుగా అయ్యావు. నీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే వాస్తవాలు తెలుసుకుని ప్రభుత్వానికి సూచనలు చేయాలి.
 
లాక్ డౌన్ సమయంలో ప్రజలకోసం కాకుండా నీ పార్టీ కార్యక్రమం కోసం వచ్చావు. ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. దేశంలో అత్యంత ప్రజాదరణ ముఖ్యమంత్రిగా జగన్ గుర్తింపు పొందారు.
 
ఏడాది పాలనలో అనేక సంక్షేమపధకాలు జగన్ ప్రజలకు అందించారు. కరోనా సమయంలో వాలంటీర్ వ్యవస్ధ ఎన్నో విలువైన సేవలు అందించింది. అద్భుతపాలన పట్ల ప్రజలంతా సుఖసంతోషాలను వ్యక్తం చేస్తున్నారు.
 
బాలకృష్ణ మానసికపరిస్ధితి బాగోలేదని గతంలో డాక్టర్ చెప్పారు. ప్రభుత్వానికి లెటర్ రాస్తున్నాను. ఎందుకంటే ఆయన హిందూపురం ఎంఎల్ ఏగా ఉంటూ ప్రజలలోకి వెళ్లినప్పుడు కొట్టడం, తిట్టడం చేస్తున్నారు. ఆయనను ఆస్పత్రిలో ఉంచాలని లెటర్ రాస్తున్నాను.

చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడేసుకుంటున్నాడు. ఆ ట్రాప్‌లో బాలకృష్ణ పడినట్లు ఆయన ఫ్యాన్స్ గమనించాలి. ఆ ట్రాప్ నుంచి బయటకు రావాలని అనుకోవాలి. 
 
మీనాన్న పెట్టిన పార్టీ, మిమ్మల్ని సైతం ముఖ్యమంత్రి పీఠం ఎక్కనీయకుండా అడ్డుకుని సైడ్ ట్రాక్ చేసిన ఘనత చంద్రబాబుది. దయచేసి బాలకృష్ణ ఆత్మపరిశీలన చేసుకోవాలి. 
 
మా ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి చిత్తశుధ్ది ఉంది. పధకాలన్నీ పారదర్శకంగా అమలు జరుగుతున్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమపధకాలు అందాలని స్పష్టంగా చెప్పారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.