గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2019 (17:53 IST)

చంద్రబాబు చిన్నమెదడు చితికిపోయింది : ఆర్కే.రోజా

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగాగా ఆమె ప్రసంగిస్తూ, అసెంబ్లీలో టీడీపీ నేతలు రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు.
 
చంద్రబాబు ఆయన కుమారుడిని అమెరికాలో చదివించానని గొప్పలు చెబుతున్నారని.. కానీ లోకేశ్‌ జయంతికి, వర్ధంతికి తేడా తెలియని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమో, దేశమో అనేది కూడా చెప్పలేని స్థితిలో లోకేశ్‌ ఉన్నాడని విమర్శించారు. 
 
చంద్రబాబు కుమారుడు అమెరికా వెళ్లింది ఇందుకేనా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు చిన్నమెదడు చితికిపోయిందని అర్థమవుతోందన్నారు. టీడీపీ పాలనలో రైతులు 90 శాతం అప్పులపాలైంది నిజంకాదా అని నిలదీశారు. 
 
సభలో సోమవారం మహిళా భద్రతపై చర్చసాగుతూంటే.. టీడీపీ నేతలు ఉల్లిపాయల దండలు మెడలో వేసుకొని వచ్చి ఆందోళన చేశారన్నారు.  మహిళలకు మీరు ఇచ్చే విలువ ఇదేనా? అంటూ ప్రశ్నించారు. వారు చేసిన హడావిడి నేపథ్యంలో ఈ రోజు చర్చకు జగన్మోహన్ రెడ్డి అవకాశమిచ్చినప్పటికీ వారు ఉపయోగించుకోవడంలేదన్నారు.
 
'టీడీపీ పాలనలో రైతులు 90 శాతం అప్పులపాలైంది నిజంకాదా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంది నిజం కాదా? రైతులు తమ ఉత్పత్తులకు మద్దతు ధర రాక వారు నలిగిపోయిన పరిస్థితులు తెలియదా?' అంటూ చంద్రబాబును సభాముఖంగా నిలదీశారు. 
 
రైతు బాంధవుడైన రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి రైతు శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు పోతున్నారని చెప్పారు. రైతు భరోసాను ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాల్సిందిపోయి.. ప్రతిపక్ష నాయకుడు విమర్శలకు దిగడం సబబు కాదన్నారు.