1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (08:49 IST)

టీడీపీ మహానాడు : తొలి రోజు తీర్మానాలు - రైతులను నిండా ముంచిన కేసీఆర్

తెలంగాణలో వ్యవసాయ రంగంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై తెలుగుదేశం మహానాలుడులో తీర్మానం చేశారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకోవడంపై మహానాడు వేదికగా నెల్లూరు దుర్గా ప్రసాద్ తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణ ఏర్పడ్డాక రైతులు బంగారు పంటలు పండిస్తారని, రైతుల కష్టాలు తీరిపోతాయని, తెలంగాణను విత్తన బాండాగారం చేస్తానని ఉద్యమకాలంలో మాయమాటలు చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రైతులను నిండా ముంచారని ఆరోపించారు. 
 
ఇందులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో రైతులు ఎంతో వేదనకు గురవుతున్నారు. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో వ్యవసాయ రంగానికి చేసిందేమీ లేదు. విత్తన బాండాగారం ఎక్కడికిపోయిందో తెలీదు కానీ నకిలీ విత్తనాలతో రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులు పడుతున్న అనేక కష్టాలపై తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో మేము ఎన్నో పోరాటాలు చేస్తున్నాము. కోటి ఎకరాల్లో ప్రొక్యూర్ మెంట్ వచ్చిందని కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. 
 
ప్రాంతీయతత్వం కలిగిన కేసీఆర్ ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అంటూ విభజిస్తున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు అన్ని ప్రాంతాలను సమానంగా చూశారు. రైతుల మీద కోపంతో పంట కొననని చెప్పిన కేసీఆర్ ప్రతిపక్షాల ఆందోళనతో దిగొచ్చారు. రైతులకు నేడు గిట్టుబాట ధర కరువైంది. వారు పండించిన పంటను  ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. తెలంగాణలో వ్యాపారులు, ప్రభుత్వం కుమ్మకయ్యి రైతులను దగా చేస్తున్నారు. రైతు బంధు పథకం భూస్వాములు, పెట్టుబడిదారులకు మాత్రమే ఉపయోగకరంగా ఉంది. 
 
 
వ్యవసాయం చేయని వారే రైతు బంధు వల్ల ఎక్కువ లబ్ధి పొందుతున్నారని మరో నేత జ్యోజి రెడ్డి అన్నారు. రైతుల సొమ్మును టీఆర్ ఎస్ నేతలు దోచుకుంటున్నారని, ఆరుగాలం కష్టించే రైతు నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.  కాళేశ్వరం పేరుతో టీఆర్ ఎస్ , కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దోచుకుంటున్నారు. తెలంగాణలో చెరువులు తెగిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 
 
ఉద్యమ సమయంలో మాయమాటలతో రైతులను నమ్మించిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వారిని రోడ్డున పడేశారు. కేసీఆర్ తీరుకు నిరసనగా తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ను ముట్టడించాం. రైతు వ్యతిరేక విధానాలు తీసుకుంటున్న కేసీఆర్ కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. 
 
తెలుగుదేశం పార్టీ రైతులకు అండగా ఉంటుంది. రైతులు ఎంత కష్ట పడుతున్నా వారికి సరైన ఫలితం దక్కడం లేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వారు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించడంలేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో ఎక్కడైనా రైతులు ఇబ్బంది వస్తే వారికి మద్దతుగా న్యాయం జరిగే వరకూ తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని చెప్పారు.