తిరుపతి మహానాడుకు తరలిరండి : మంత్రి నారాయణ
తిరుపతిలో ఈనెల 27, 28, 29తేదీలలో జరిగే మహానాడుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పి నారాయణ పిలుపునిచ్చారు. మహానాడు పనులను నెహ్రూ మున్సిపల్ సభాస్థలిలో మంత్రి నారాయణ పరిశీలించారు. స్థానిక నాయకులతో నారాయణ సమీక్షించారు. అలాగే మహానాడుకు వచ్చే వాహనాల పార్కింగ్ విషయంపై పోలీసులతో చర్చించారు.
ఈ మహానాడు కారణంగా తిరుపతి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పోలీసులను, స్థానిక అధికారులను కోరారు. అలాగే, సభాస్థలి మొత్తాన్ని పరిశీలించిన నారాయణ జరుగుతున్న పనులపై సంతృప్తి వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే 30 వేల మందికిపైగా టిడిపి నాయకులు, కార్యకర్తలు మహానాడుకు తరలివస్తారని అంచనాకు వచ్చామన్నారు. అందుకు అందరికీ సరిపోయేలా సభాస్థలిని ఏర్పాటు చేశామన్నారు.
అయితే మారుమూల ప్రాంతంలోని టీడీపీ కార్యకర్తలు, నాయకులు కూడా తరలిరావాలని పిలుపునిచ్చారు. పార్టీ పండుగగా దీన్ని ప్రతి ఒక్కరు భావించాలని, మహానాడులో తీసుకునే కీలక నిర్ణయాలన్నింటినీ ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని పిలుపు నిచ్చారు.