శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 జూన్ 2020 (07:47 IST)

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు 14 రోజులు రిమాండ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈఎస్ఐ అవినీతి కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కె. అచ్చెన్నాయుడుకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. అయితే, ఆయనకున్న అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని ఏపీ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీచేసింది. 
 
నిజానికి ఈఎస్ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడుని అరెస్టు చేయగా, ఆయనను విజయవాడకు తరలించారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచడంతో ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. 
 
కోర్టు ఆదేశాలతో పోలీసులు తొలుత విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అనంతరం జైలు అధికారుల అనుమతితో గుంటూరు జీజీహెచ్‌కు తరలించనున్నారు. ఇదే కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రమేశ్ కుమార్‌ను రాజమండ్రి సబ్ జైలుకు తరలించారు.
 
ఈఎస్ఐ ఆసుపత్రుల్లో మందు కొనుగోళ్లలో అవకతవకలు సంబంధించిన కేసులో అచ్చెన్నాయుడిని శుక్రవారం అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు వైద్య పరీక్షల అనంతరం మంగళగిరి న్యాయమూర్తి నివాసానికి తరలించారు. 
 
మాజీ మంత్రితోపాటు ఈ కేసులో ఏ1 నిందితుడైన రమేశ్ కుమార్‌ను కూడా అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. వాదనల అనంతరం అచ్చెన్నాయుడు, రమేశ్ కుమార్‌లకు న్యాయమూర్తి రెండు వారాల పాటు రిమాండ్ విధించారు.