1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 14 జులై 2019 (17:44 IST)

రాజకీయ జన్మనిచ్చిన చిరంజీవి పార్టీని కూల్చావు : బుద్ధా వెంకన్న

తెలుగుదేశం పార్టీకి చెందిన పార్టీ సీనియర్ నేతలు కొడాలి నాని, బుద్ధా వెంకన్నల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ట్విట్టర్ ఖాతా వేదికగా చేసుకుని వీరిద్దరూ ఒకరిపై ఒకరు ట్వీట్ల రూపంలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇది టీడీపీ నేతలతో పాటు పార్టీ అధినేతకు తలనొప్పిగా మారాయి. 
 
తాజాగా కేశినేని నాని ఓ ట్వీట్ చేస్తూ, "నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు… నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేని వాడు... నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్‌ చేస్తున్నాడు" అంటూ నాని ట్వీట్‌లో పేర్కొన్నాడు.
 
దీనికి బుద్ధా వెంకన్న కౌంటరిచ్చారు. "చిరంజీవి నీకు రాజకీయ జన్మనిస్తే చిరంజీవిని అనరాని మాటలని చిరంజీవి పార్టీని కూల్చావు.. చంద్రబాబు నీకు రాజకీయ పునర్జన్మ ఇస్తే ఇవాళ చంద్రబాబు గురించి శల్యుడులా మాట్లాడుతున్నావు. విజయసాయి రెడ్డి మీద నేను పోరాడుతున్నానో నువ్వు పోరాడుతున్నావో ప్రజలకు తెలుసు" అంటూ పేర్కొన్నారు. 
 
మెగాస్టార్ చిరంజీవి రాజకీయ జన్మనిస్తే ఆయన్ను కేశినేని నాని అనరాని మాటలు అన్నాడనీ, ప్రజారాజ్యం పార్టీని కూల్చేశాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ పునర్జన్మ ప్రసాదిస్తే, ఇప్పుడు ఆయన గురించి శల్యుడిలాగా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు.
 
వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై ఎవరు పోరాడుతున్నారో ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఏం చేయాలో తెలియక కేశినేని నాని అబద్ధాలు ఆడుతున్నారనీ, ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటకు వచ్చేముందు ఆడిన ఆటలు టీడీపీలో చెల్లవని స్పష్టంచేశారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.