1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (02:19 IST)

చంద్రబాబుపై ఫైర్ అవుతున్న నాన్ కమ్మ ఎంపీలు.. శివప్రసాద్ ఒక్కరు బయటపడ్డారంతే!

కమ్మకులానికి చెందని తెలుగు దేశం ఎంపీల ముఖం చూడటానికి కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టపడటం లేదా. అందులోనూ పార్టీలోనే ఎస్సీ నేతలు, ప్రజాప్రతినిధులు, ఎంపీలను కూడా ఘోరంగా అవమానించడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారా.. రాష్ట్రం మొత్తంమీద అన్ని జిల్లా

కమ్మకులానికి చెందని తెలుగు దేశం ఎంపీల ముఖం చూడటానికి కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టపడటం లేదా. అందులోనూ పార్టీలోనే ఎస్సీ నేతలు, ప్రజాప్రతినిధులు, ఎంపీలను కూడా ఘోరంగా అవమానించడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారా.. రాష్ట్రం మొత్తంమీద అన్ని జిల్లాల్లో ఎస్సీలను సీఎం బాబు గాలికొదిలేశారా? ఢిల్లీకి పనిమీద వెళ్ళినప్పటికీ సుజనా చౌదరితో తప్ప చంద్రబాబు మరే ఎంపీనీ కలవడానికి ఇష్ట పడటం లేదా? తమను లెక్కచేయని చంద్రబాబు పట్ల తెలుగుదేశం పార్టీ కమ్మ కులేతర ఎంపీలు ఆగ్రహంతో మండిపడుతున్నారా? వాళ్లలో ఇప్పటికి చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మాత్రమే బయటపడిపోయారా? 
 
ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే నర్మగర్భంగా సమాధానం వస్తోంది. చంద్రబాబుపై బహిరంగ వేదిక నుంచే విరుచుకుపడి తీవ్రాతితీవ్రమైన ఆరోపణలు చేసిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ను దాదాపు పార్టీనుంచి బహిష్కరించడానికి చంద్రబాబు రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ఎంపీ శివప్రసాద్ మరోసారి చంద్రబాబును సవాల్ చేయడమే కాకుండా నన్ను బురదలోకి లాగడానికి సిద్ధమైతే బాబును కూడా బురదలోకి లాగడానికి సై అనేశారు. 
 
గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో దళితులకు టీడీపీ ప్రభుత్వం వల్ల ఒరిగిందేమీ లేదని అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా శుక్రవారం శివప్రసాద్‌ చిత్తూరులో ధ్వజమెత్తడం విదితమే. ఈ వ్యాఖ్యలు ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. నిజంగానే చంద్రబాబు దళితులకు ఏం చేశారనే చర్చ ఆ పార్టీ నేతల్లోనే మొదలైంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం సీఎం చంద్రబాబు మంత్రులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి, ఎంపీ శివప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ నేపథ్యంలో మరోసారి తీవ్ర ఆవేదనకు గురైన ఎంపీ శివప్రసాద్‌ శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుపతిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. చంద్రబాబు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో, ముఖ్యమంత్రి వద్ద తనకు ప్రాధాన్యత లభించడం లేదన్నారు. ‘చిత్తూరు వేదికపై నేనేం తప్పు మాట్లాడలేదే.. దళితులకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించాను. అధికార పార్టీలో ఉండీ కూడా ఏం చేయలేక నిస్సహాయంగా నిలబడాల్సి వస్తోందని ఎప్పటి నుంచో కడుపులో బాధ. నాలుగు నెలల కిందటే శ్రేయోభిలాషులకు చెప్పాను. అంబేడ్కర్‌  జయంతి సభలో నా జనాన్ని చూసే సరికి ఆపుకోలేక పోయాను. మనసులో భాధ బయటకొచ్చింది. ఇందులో తప్పేముంద’ని చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించారు.
 
శివప్రసాద్ అంతటితో ఆగిపోలేదు. చంద్రబాబు వైఖరిని చూసి టీడీపీలో ఎంపీలందరూ బాధపడుతున్నారని, అసహనంతో ఊగిపోతున్నారని చెప్పేశారు. సొంత పార్టీ ఎంపీలకే కలవడానికి సీఎం చంద్రబాబు అవకాశం ఇవ్వకపోతే ఎంపీలకు చంద్రబాబు ఇచ్చే గౌరవం ఏమిటి అని ఆయన నిలదీశారు. చంద్రబాబుతో మాట్లాడాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా టైమివ్వడం లేదు. రాష్ట్రంలో కాకుండా ఢిల్లీకి వచ్చినపుడూ ఒక్క నిమిషం సమయం కేటాయించడం లేదు. ఎంపీలందరూ బాధపడుతున్నారు అని శివవ్రసాద్ పేర్కొన్నారు. 
 
ఈ సందర్భంగా ఇటీవలే తనకు చంద్రబాబు వద్ద జరిగిన అవమానాన్ని పూస గుచ్చినట్లు ఎంపీ శివప్రసాద్ చెప్పేశారు. ఈ మధ్య విజయవాడలో జరిగిన పార్టీ వర్క్‌ షాప్‌నకు వెళ్లినపుడు కాలు జారి కింద పడినప్పుడు చంద్రబాబు తనను చూశారని, కానీ మరుసటి రోజు సీఎంను కలిసేందుకు ఇంటికెళితే తనను కలవడానికి మూడు గంటలు వెయిట్‌ చేయించారు. నేను కింద పడితే ఎలా ఉన్నావంటూ అడగడానికి కూడా చంద్రబాబుకు టైం లేకపోతే మాకిచ్చే గౌరవం ఏమిటి అని శివప్రసాద్  ఆవేదన వ్యక్తం చేశారు. 
 
నేను పార్టీ నుంచి బయటకు వెళ్తాననీ చెప్పలేదే. ఎవరో ఏదో చెబితే మీరు నమ్ముతారా మీరే చెట్టును పెంచి మీరే కూల్చేయాలనుకోవడం న్యాయం కాదు.  టెలీకాన్ఫరెన్సు ద్వారా నన్ను తిట్టాల్సిన పని లేదు. బురదలోకి లాగడానికి ప్రయత్నిస్తే నేనూ సిద్ధమే అని  శివప్రసాద్‌ ఘాటుగా సమాధానమిచ్చారు.
 
చంద్రబాబుపై శివప్రసాద్ చేసిన విమర్శలు మామూలువి కాదు. అటో ఇటో తేల్చుకోవాలనే ఉద్దశంతో అంబేడ్కర్ జయంతి సందర్భంగా చిత్తూరులో బహిరంగ వేదికపై చంద్రబాబుపై ఎంపీ చేసిన ఆరోపణలు రాష్ట్రమంతటా సంచలనం కలిగించాయి. ఆగ్రహంతో రగిలిపోయిన చంద్రబాబు చిత్తూరు ఎంపీని, మరొక సీనియర్ నేతను పార్టీనుంచి సాగనంపాలని దాదాపు సిద్ధపడిపోయారు కానీ తెలుగుదేశంలో నివురు కప్పిన నిప్పు ఒకరిద్దరిపై వేటు వేసినంతమాత్రాన చల్లారదని తెలుస్తోంది.