బుధవారం, 25 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2024 (14:01 IST)

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు : మంత్రి నారా లోకేశ్

nara lokesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన కర్మాగారాల్లో ఒకటైన విశాఖ ఉక్కు కర్మాగారం ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కాబోదని ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు స్పష్టంచేశారు. అయితే, వైకాపా వంటి కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఉద్దేశపూర్వకంగానే ఈ అంశంపై రాజకీయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన బుధవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, "విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగనీయబోమని స్వయంగా సీఎం చంద్రబాబే చెప్పారు కదా. పాదయాత్ర సమయంలో తాను కూడా అదే చెప్పాను. గత ఐదేళ్లలో విశాఖ ఉక్కుకు ఏ కొంచెమైనా సాయం జరిగిందా? ప్రైవేటీకరణ యోచనే లేదు. వైకాపా మాత్రం ప్రతిరోజూ ఎక్స్‌లో పోస్ట్‌ పెడుతుంది. ఇంకా వాళ్లకు బుద్ధిరాలేదు" అని లోకేశ్‌ వ్యాఖ్యానించారు. 
 
తమ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు వైకాపా నేతలకు మరో అంశం లేదన్నారు. అందుకే ప్రజల సెంటిమెంట్‌కు సంబంధించిన అతి సున్నితమైన విశాఖ ఉక్కు అంశంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పినా వైకాపా నేతలకు ఇంకా బుద్ధిమారలేదన్నారు.